నేడు భారత్కు ఎంజే అక్బర్: ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: 'మి టూ' అంటూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజే అక్బర్ విషయంలో బీజేపీ తర్జన భర్జన పడుతోంది. ఆయనను తొలగించాలని మహిళా సంఘాలు, పలువురు డిమాండ్ చేస్తోన్న నేపథ్యంలో బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. ఎంజే అక్బర్ ఆదివారం భారత్ తిరిగి రానున్నారు. ఆయన వచ్చాక అభిప్రాయం తెలుసుకొని, మోడీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఎంజే అక్బర్ మంత్రి పదవి నుంచి తప్పుకుంటారా? లేదా అనే దానిపై ఈ రోజు స్పష్టత రానుంది. పలువురు మహిళా పాత్రికేయులు అక్బర్ తమతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ సోషల్ మీడియా ద్వారా బయటపెట్టిన విషయం తెలిసిందే.
ఎంజే అక్బర్పై వేధింపుల ఆరోపణలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఆయన పదవిలో కొనసాగే అవకాశం లేదని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. తనపై వస్తున్న ఆరోపణల విషయంలో మంత్రి వివరణ ఇచ్చుకున్న తర్వాత నరేంద్ర మోడీ తుది నిర్ణయం తీసుకుంటారు.
ప్రియరమణి అనే జర్నలిస్ట్ 'మి టూ' ఉద్యమంలో భాగంగా అక్బర్పై ఆరోపణలు చేశారు. ఆమె అనంతరం దాదాపు పదిమంది మహిళలు కూడా అక్బర్ తమను వేధించాడంటూ సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. ఈ వివాదంపై స్పందించాల్సిందిగా కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్ను మీడియా ప్రతినిధులు కోరగా.. వారు మాట్లాడలేదు. ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు డిమాండ్ చేస్తున్నారు.