బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములుకు షాక్: కాంగ్రెస్ లో చేరుతున్న ఎమ్మెల్యే నాగేంద్ర!
బెంగళూరు: బళ్లారి చుట్టుపక్కల జిల్లాల్లో బీజేపీకి పెద్దదిక్కుగా ఉన్న ఆ పార్టీ ఎంపీ శ్రీరాములు ( మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు)కు ఆయన సన్నిహితుడు, కూడ్లగి శాసన సభ్యుడు బి. నాగేంద్ర షాక్ ఇవ్వడానికి సిద్దం అయ్యారు. బళ్లారి జిల్లాాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎంపీ శ్రీరాములు తన అనుచరుడైన ఎమ్మెల్యే నాగేంద్ర కాంగ్రెస్ గూటికి చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎమ్మెల్యే నాగేంద్ర
బీజేపీ ఎంపీ శ్రీరాములుకు ముఖ్యఅనుచరుడిగా ఉంటూ 2013 శాసన సభ ఉన్నికల్లో కూడ్లగిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయిన బి. నాగేంద్ర త్వరలో కాంగ్రెస్ తీర్థం తీసుకోవడానికి సిద్దం అవుతున్నారని ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది.
టచ్ లో లేరు !
ఈ విషయంపై స్పంధించిన బీజేపీ ఎంపీ శ్రీరాములు ఎమ్మెల్యే నాగేంద్ర కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తన వరకూ వచ్చిందని అన్నారు. ఎమ్మెల్యే నాగేంద్రను తాను సంప్రధించడానికి ప్రయత్నిస్తున్నానని, ఆయన అందుబాటులోలేరని ఎంపీ శ్రీరాములు చెప్పారు.
ధైర్యంగా పోటీ చేస్తాం
రాజకీయాల్లో ఇలాంటివి సహజం, ఎమ్మెల్యే నాగేంద్రతో మాట్లాడి త్వరలోనే ఓ పరిష్కారం చూపించడానికి ప్రయత్నిస్తానని ఎంపీ శ్రీరాములు చెప్పారు. అయితే ఎమ్మెల్యే నాగేంద్ర తన మాట కాదని కాంగ్రెస్ పార్టీలో చేరితే తాము ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేసి ఆయన్ను ఎదుర్కొంటామని ఎంపీ శ్రీరాములు స్పష్టం చేశారు.
జనవరి 4వ తేదీ నిర్ణయం
2018 శాసన సభ ఎన్నికల్లో బళ్లారి జిల్లాలోని 9 శాసన సభ నియోజక వర్గాలను బీజేపీ సొంతం చేసుకుంటుందని, అందులో ఎలాంటి సందేహం లేదని ఎంపీ శ్రీరాములు అన్నారు. జనవరి 4వ తేదీ కూడ్లగిలో బీజేపీ కర్ణాటక పరివర్తనా యాత్ర జరుగుతోందని, ఆ రోజు కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుని ఓ నిర్ణయం తీసుకుంటామని శ్రీరాములు వివరించారు.
బీజేపీకి డిపాజిట్ గల్లంతు
2013 శాసన సభ ఎన్నికల్లో శ్రీరాములు అనుచరుడు బి. నాగేంద్ర స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 71, 477 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎస్. వెంకటేష్ కు 46, 647 ఓట్లు వచ్చాయి. బీజేపీ టిక్కెట్ తో పోటీ చేసిన రామప్ప కేవలం 2, 632 ఓట్లు సంపాధించి డిపాజిట్ కొల్పోయారు.