రేప్ కేస్ పెట్టిన మహిళ.. ఆమెను అర్థాంగిని చేసుకున్న ఎమ్మెల్యే..!
అగర్తలా : అతనో రాజకీయ నాయకుడు. గతేడాదే ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యాడు. ఇంతలో ఓ మహిళ అతనిపై రేప్ కేస్ పెట్టింది. దీంతో ఎమ్మెల్యే కాస్తా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. బెయిల్ కోసం ఎన్నిసార్లు పిటీషన్ వేసినా కోర్టు తిరస్కరిస్తుండటంతో చివరకు ఓ నిర్ణయం తీసుకున్నాడు. తనపై కేసు పెట్టిన మహిళను పెళ్లి చేసుకున్నాడు.
త్రిపురలోని రిమా వ్యాలీ ఐపీఎఫ్టీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ధనుంజయ్. అదే రాష్ట్రంలోని దలాయి ప్రాంతానికి చెందిన ఓ మహిళ గత నెల 20న అగర్తలలోని మహిళా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. కొంతకాలంగా తనతో సన్నిహితంగా మెలుగుతున్న ఎమ్మెల్యే ధనుంజయ్ పెళ్లి చేసుకోమని అడిగేసరికి ముఖం చాటేశాడని ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని కంప్లైంట్లో పేర్కొంది. దీంతో పోలీసులు ఆయనపై మోసం, అత్యాచారం కేసు నమోదు చేశారు.
కేసు నమోదు కావడంతో ఎమ్మెల్యే ధనుంజయ్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. అయితే బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం అంగీకరించచలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కేసు పెట్టిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం అగర్తలాలోని చతుర్దాస్ దేవతా టెంపుల్లో ఇరు కుటుంబాల సభ్యుల మధ్య మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.