ఇక మాటల్లేవ్: 23 తరువాత సినిమా చూపిస్తా, రెబల్ ఎమ్మెల్యే, సంకీర్ణ ప్రభుత్వానికి షాక్ !
బెంగళూరు: లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తాను మీడియా ముందు మాట్లాడుతానని కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ గోకాక్ రెబల్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి బాంబు పేల్చారు. లోక్ సభ ఎన్నికల సందర్బంగా ఓటు వేసిన రమేష్ జారకిహోళి బెంగళూరు చేరుకున్నారు. బుధవారం బెళగావిలోని సాంబ్రా విమానాశ్రయానికి కుమారుడు అమర్ తో కలిసి చేరుకున్న రమేష్ జారకిహొళి మీడియాతో మాట్లాడారు.
అనుచరులు రాజీనామా
కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి ప్రధాన అనచరులు ఇద్దరు ఇటీవల గ్రామ పంచాయితీ అధ్యక్షస్థానాలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. బెళగావి చేరుకున్న రమేష్ జారకిహోళి గోకాక్ చేరుకుని తన అనుచరులతో సమావేశం కానున్నారు.
రాజీనామా చేస్తాను
ఏఫ్రిల్ 23వ తేదీ బెళగావిలో మీడియాతో మాట్లాడిన రమేష్ జారకిహోళి తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బాంబు పేల్చారు. బెళగావి నుంచి బెంగళూరు చేరుకున్న తరువాత రమేష్ జారకిహోళి తాను రాజీనామా చేస్తానని చెప్పలేదని మాటమార్చారు. అయితే రమేష్ జారకిహొళి బెంగళూరు పర్యటన కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది.
ఒక్కడే రాజీనామా చెయ్యను !
ఒక్కడే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని రమేష్ జారకిహొళి మరోసారి బాంబు పేల్చారు. కొందరు ప్రముఖులతో కలిసి తాను రాజీనామా చేస్తానని రమేష్ జారకిహోళి అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని నాయకులు కొందరితో తాను ఇంకా చర్చలు జరపాలని రమేష్ జారకిహోళి అన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా రాజీనామా చేస్తానని, అందులో ఎలాంటి అనుమానం లేదని రమేష్ జారకిహోళి అన్నారు.
త్రిబుల్ షూటర్
సోమవారం బెళగావిలో త్రిబుల్ షూటర్ డీకే. శివకుమార్ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రమేష్ జారకిహోళి దూరంగా ఉన్నారు. అయితే రమేష్ జారకిహోళి సోదరుడు, మంత్రి సతీష్ జారకిహోళి సమావేశానికి హాజరైనారు. సతీష్ జారకిహోళి మాట్లాడుతూ పార్టీ నుంచి వెళ్లిపోవాలని రమేష్ జారకిహోళికి ఎవ్వరూ చెప్పలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండాలా ? వద్దా ? అనే విషయం రమేష్ జారకిహోళికి సంబంధించిన విషయం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. బెంగళూరులో ఇంతకాలం మకాం వేసిన రమేష్ జారకిహోళి ఎప్పటికప్పుడు బెళగావి, గోకాక్ లో ఏం జరుగుతుంది అంటూ అల్లుడు అంబిరావ్ పాటిల్ నుంచి సమాచారం తెలుకున్నారు.