మంత్రి పదవుల కోసం పార్టీలు మారటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం: వెంకయ్యనాయుడు
ఢిల్లీ: శాసనసభ్యులు పార్టీ మారే ముందు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు. పార్టీలు మారీ మంత్రి పదవులు పొందడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలా చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు.భారత పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్థల పరిరక్షణ నేతలపై కాకుండా రాజకీయ పార్టీలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందన్నారు.
ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్గా ఏడాది కాలంలో తన అనుభవాలు, చేపట్టిన కార్యక్రమాలతో 'మూవింగ్ ఆన్, మూవింగ్ ఫార్వర్డ్: ఎ ఇయర్ ఇన్ ఆఫీస్' పేరుతో రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. పారదర్శకత, జవాబుదారీతనం కోసమే తన ఏడాది ప్రయాణానికి పుస్తక రూపం కల్పించినట్లు వెంకయ్య తెలిపారు. 'ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో చేరేవారు ముందుగా రాజీనామా చేసి పార్టీ వీడాలి. లేదంటే వారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద మూడునెలల్లో చర్యలు తీసుకోవాలి' అని అన్నారు.
మరోవైపు ఇదే వేదికపై మాట్లాడిన ప్రధాని వెంకయ్యనాయుడు క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఆయనతో పనిచేయడమంటే ముందుగా క్రమశిక్షణతో మెలగాలని గుర్తుచేసుకున్నారు. క్రమశిక్షణ ఉండాలని ఎవరైనా చెబితే చెప్పిన వ్యక్తిని నియంతగా ముద్రవేస్తున్నారని ప్రధాని అన్నారు. లక్ష్యసాధనలో వెంకయ్య నాయుడు స్పష్టమైన ప్రణాళికలతో పనిచేస్తారని ప్రశంసించారు ప్రధాని మోడీ.నాటి ప్రధాని వాజ్పేయి వెంకయ్యకు తన కేబినెట్లో అతి ప్రాముఖ్యమైన పోర్ట్ ఫోలియో ఇవ్వగా దాన్ని సున్నితంగా తిరస్కరించి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖను తీసుకున్నారని మోడీ గుర్తు చేశారు. అందుకే ఆయనకు గ్రామాలపై అంత ప్రేమ అని చెప్పారు. వెంకయ్య నాయుడితో కలిసి ప్రయాణం చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయన వాచీ పెట్టుకోరని, జేబులో పెన్ను , డబ్బులు ఉంచుకోరని గుర్తు చేశారు ప్రధాని. కానీ సరైన సమయానికి కార్యక్రమాలకు హాజరవుతారని దాన్నే క్రమశిక్షణ అంటామని మోడీ అన్నారు.