స్కూటర్ లో కేంద్ర మంత్రితో బళ్లారి శ్రీరాములు, నేను రైల్వే కూలీ కొడుకు, ప్రజల సేవ!
బెంగళూరు: కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ఆకస్మిక మరణంతో కర్ణాటక మాజీ మంత్రి, మాళకాల్మూరు బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు తీవ్రవిషాదం వ్యక్తం చేశారు. కర్ణాటక బీజేపీ శాఖలో అనంతకుమార్ లేని లోటు ఎప్పటికీ తీరదని, తాము స్కూటర్ లో సంచరించామని, తాను రైల్వే కూలి కొడుకు అని చెప్పడంతో తనను ఎంతో ప్రోత్సహించారని బళ్లారి శ్రీరాములు అన్నారు.
రెండు కళ్లు
కర్ణాటక బీజేపీ శాఖకు మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప, అనంత్ కుమార్ రెండు కళ్లులాంటి వారని బళ్లారి శ్రీరాములు చెప్పారు. అనంత్ కుమార్ తాను ఎన్నోసార్లు స్కూటర్ లో సంచరించామని బళ్లారి శ్రీరాములు గుర్తు చేసుకున్నారు.
యువతకు ఆదర్శం
ఉత్తర కర్ణాటక అభివృద్ది కోసం తనను పార్టీ తరుపన పోరాటం చెయ్యాలని అనంత్ కుమార్ సూచించారని బళ్లారి శ్రీరాములు అన్నారు. తాను ఎంపీగా విజయం సాధించిన సమయంలో ప్రజలకు సేవ చెయ్యాలని, నీవు యువకులకు మార్గదర్శకంగా ఉండాలని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ సూచించారని బళ్లారి శ్రీరాములు గుర్తు చేశారు.
ప్రధానికి సన్నిహితుడు
కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ప్రధాని నరేంద్ర నరేంద్ర మోడీతో ఎంతో సన్నిహితంగా ఉంటారని, ఓ మంచి వ్యక్తి దూరం అయినందుకు తాను ఎంతగానో భాదపడుతున్నానని, ఆయన కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని శ్రీరాములు భగవంతుడిని వేడుకున్నారు.
ఎమ్మెల్యే ఎన్నికలు
2008లో తాను శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయిన సమయంలో అనంత్ కుమార్ తన దగ్గరకు వచ్చి నీవు ఎక్కడి నుంచి వచ్చావు ?, మీ నాన్న ఏం చేస్తుంటారు ? రాజకీయలు తెలుసా అని ప్రశ్నించారని శ్రీరాములు గుర్తు చేసుకున్నారు.
నాన్న రైల్వే కూలి
మా నాన్న రైల్వే కూలీ అని తాను చెప్పడంతో తాను కూడా రైల్వే శాఖ కుటుంబం నుంచి వచ్చానని చెప్పిన అనంత్ కుమార్ అప్పటి నుంచి తనతో సన్నిహితంగా ఉండేవారని శ్రీరాములు గుర్తు చేసుకున్నారు. అనేక సమస్యలతో తాను వెళ్లిన సందర్బాల్లో కుర్చోపెట్టుకుని చిరునవ్వుతో తనను కూల్ చేసేవారని శ్రీరాములు అన్నారు. అనంతకుమార్ ఆత్మకు శాంతికలగాలని శ్రీరాములు భగవంతుడిని వేడుకున్నారు.