తృణమూల్ కు ఎమ్మెల్యేల షాక్ ..! బేజారైపోతున్న దీదీ..!!
హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి తేరుకోకముందే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. బెంగాల్లో కమలం వికసించడంతో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జారుకుంటున్నారు. మంగళవారం తృణమూల్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక సీపీఎం ఎమ్మెల్యే బీజేపీలో చేరారు. వీరితోపాటు 50 మందికిపైగా కౌన్సిలర్లు బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. వీరిలో ఎక్కువ మంది టీఎంసీ పార్టీ వారు ఉండటం గమనార్హం.
బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్ కొడుకు టీఎంసీ ఎమ్మెల్యే సుభ్రాన్షు రాయ్తోపాటు ఎమ్మెల్యేలు తుషార్కాంతి భట్టాచార్య (టీఎంసీ), దేవేంద్రనాథ్ రాయ్ (సీపీఎం) బీజేపీలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై సుభ్రాన్షుని పార్టీ నుంచి ఆరేళ్ల పాటు టీఎంసీ బహిష్కరించింది. బెంగాల్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల సీఎం మమతా బెనర్జీ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో అనుకోని చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరో ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న ఆ పార్టీ కి, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రోజుకో ఝలక్ ఇస్తున్నారు. మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాల మెడపై కత్తి వేలాడదీసినట్టే బెంగాల్ లో కూడా అదే పని చేసేందుకు బీజేపి పావులు కదుపుతోంది. అందుకు తృణమూల్ లో కొంత మంది ఎమ్మెల్యేలు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక ఇదే అంశం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్టు తెలుస్తోంది. మోడీ ప్రమాణ స్వీకారం ముగిశాక ఏ సమయంలోనైనా బెంగాల్ లో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. ఈ నెల 30న మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాక ఏ క్షణానైనా ప్రభుత్వాలు మారే అవకాశాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. దీంతో ఎమ్మెల్యేలను కాపాడుకోవడం పార్టీ అధినేతలకు కష్టంగా మారిపట్టు తెలుస్తోంది.