అజిత్ పవార్ కు షాక్ ఇచ్చిన ఆ ఎమ్మెల్యేలు .. శరద్ పవార్ దగ్గరకు వెళ్లి సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యంగా మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. నిన్నటి వరకు కాంగ్రెస్, ఎన్సీపీ , శివసేన కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావించగా ఊహించని విధంగా రాత్రికి రాత్రే రాజకీయాల్లో పరిణామాలు మారిపోయాయి. ఎన్సీపీలో చీలికతో మహారాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా నడిచింది. శరద్ పవార్ తమ్ముడి కొడుకు అజిత్ పవార్ అనూహ్యంగా బీజేపీకి మద్దతు ప్రకటించడంతో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
మహా రాజకీయాలను మలుపు తిప్పిన, ఎన్సీపీని రెండుగా చీల్చిన అజిత్ పవార్ ప్రస్థానం ఇదే
బలనిరూపణకు కావాల్సిన సభ్యుల మద్దతు కూడగట్టాకే అజిత్ నిర్ణయం
ఇక బీజేపీ బలనిరూపణ చేసుకోటానికి కావాల్సిన సభ్యుల మద్దతు కూడగట్టిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు అజిత్ పవార్. కానీ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక, ఇప్పుడు సభలో బీజేపీకి 105 మంది..అజిత్ వర్గంలో ఎన్సీపీ నుండి 22 మంది మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో..స్వతంత్రుల వైపు బీజేపీ చూస్తోంది. ఇదే సమయంలో ఢిల్లీ కేంద్రంగా బీజేపీ అగ్ర నేతలు ఎన్సీపీ..శివసేనలో చీలికకు సిద్దంగా ఉన్న నేతల పైన ఫోకస్ పెట్టారు.
ఈ నెల 30లోగా మహా రాజకీయాల్లో కీలక మార్పులకు ఆస్కారం
ఈ నెల 30లోగా అసెంబ్లీలో ఫడ్నవీస్ తన బలం నిరూపించుకోవాలని గవర్నర్ స్పష్టం చేసారు. రాష్ట్రపతి పాలన ఉప సంహరించి, ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే విధంగా వేగంగా బీజేపీ పావులు కదిపింది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు.రానున్న వారం రోజులు మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. అయితే ఈ రోజు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అజిత్ పవార్ కు మద్దతుగా రాజ్ భవన్ కు వెళ్ళిన నేతలు కొందరు తిరిగి శరద్ పవార్ వద్దకు వచ్చారు.
అజిత్ పవార్ కు అప్పుడే షాక్ ఇచ్చిన ఎమ్మెల్యేలు
ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా అజిత్ పవార్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేల్లో కొందరు యూటర్న్ తీసుకుని ఆయనకు షాక్ ఇచ్చారు. ముగ్గురు ఎమ్మెల్యేలు తిరిగి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వద్దకు చేరుకున్నారు. ఏదో పని ఉందంటూ అజిత్ పవార్ ఫోన్ చేశారని, దీంతో తాము రాజ్ భవన్ కు వెళ్లామని చెప్పారు. తమకు అంతకు మించి ఏమీ తెలియదని వివరించారు. రాజ్ భవన్ కు వెళ్లి మళ్లీ వచ్చేసిన ఎన్సీపీ ఎమ్మెల్యే రాజేంద్ర షింగానె ఇదే విషయమై మీడియాతో మాట్లాడారు.
తమకేం తెలీదు .. అజిత్ రమ్మంటే రాజ్ భవన్ కు వెళ్ళాం అన్న ఎమ్మెల్యే రాజేంద్ర షింగానె
అజిత్ పవార్ తనకు ఫోన్ చేసి ఓ విషయంపై చర్చించాలని పిలిచారు. రాజ్ భవన్ వెళ్లాను. అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుతోంది. దీంతో నేను వెంటనే తిరిగి శరద్ పవార్ వద్దకు వెళ్లిపోయాను. నేను శరద్ పవార్ తోనే ఆయనకు మద్దతుగా ఉంటానని చెప్పాను. అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుందన్న విషయం కూడా మాకు తెలియదు అని ఎన్సీపీ ఎమ్మెల్యే రాజేంద్ర షింగానె వ్యాఖ్యానించారు. ఇక మరో ఇద్దరు సైతం శరద్ పవార్ కే తమ మద్దతు అని ప్రకటిస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలో బలనిరూపణ వరకు ఈ సందిగ్ధం , నెంబర్ గేమ్ కొనసాగే అవకాశం ఉంది.