కమల్నాథ్ సర్కార్తో ప్రాణహానీ, కేంద్రమే భద్రత కల్పించాలి, బెంగళూరులో రెబల్ ఎమ్మెల్యేలు
మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభానికి కారణమైన రెబల్ ఎమ్మెల్యేలు ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చారు. బెంగళూరు రిసార్ట్లో ఉన్న అసమ్మతి ఎమ్మెల్యేలు నోరువిప్పారు. కమల్నాథ్ ప్రభుత్వంతో తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం తమకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో కీ రోల్ పోషించిన జ్యోతిరాదిత్య సింధియాను పార్టీ పట్టించుకోలేదని ఆరోపించారు.
తమ సమస్యలపై మాట్లాడేందుకు సీఎం కమల్నాథ్ తమకు ఎప్పుడూ సమయం కేటాయించలేదని ఆరోపించారు. కమల్నాథ్ ప్రభుత్వం పట్ల తాము అసంతృప్తితో ఉన్నామని పేర్కొన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నామని.. అందుకే బెంగళూరు వచ్చామని తెలిపారు.
తమను ఎవరూ ఇక్కడికి తీసుకురాలేదని రెబల్ ఎమ్మెల్యేలు సష్టంచేశారు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని పేర్కొన్నారు. ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసినా.. తమకు కమల్నాథ్ ప్రభుత్వం నుంచి ప్రాణహానీ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా రాజీనామాతో ముసలం నెలకొన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో రాజకీయ అస్థిరత నెలకొంది. 22 మంది ఎమ్మెల్యేల రాజీనామా చేయగా స్పీకర్ ప్రజాపతి కేవలం ఆరుగురివి మాత్రమే ఆమోదించారు.
మిగిలిన 18 మందివి సస్పెన్స్లో ఉంచారు. దీంతో రాష్ట్రంలో 228 సీట్లు ఉండగా ఆ సంఖ్య 222కి పడిపోయింది. అంటే మెజార్టీ మార్క్ 112కి చేరింది. బీజేపీకి 107 సీట్లు ఉండటంతో ఐదు సీట్ల దూరంలో ఉంది. ఇండిపెండెంట్ మద్దతు ఇచ్చిన ఆ పార్టీ అధికారం చేపట్టడం కష్టమే అవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.