తెలంగాణ తొలి మహిళా మెకానిక్... ఎడవల్లి ఆదిలక్ష్మికి ఎమ్మెల్సీ కవిత చేయూత...
జీవిత పోరాటంలో కష్టాలు,కన్నీళ్లను అధిగమించాలంటే ముందు కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి. నావల్ల ఏమవుతుంది... నేనేం చేయగలను అని ఖాళీగా కూర్చొండిపోతే కుదరదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఎడవల్లి ఆదిలక్ష్మి ఇదే చేసింది. ఒక సాధారణ గృహిణిగా కొన్నాళ్ల క్రితం వరకు ఇంటి వ్యవహారాలు చక్కదిద్దిన ఆమె... ఇప్పుడు తెలంగాణ తొలి మహిళా మెకానిక్గా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. బతుకుపోరులో మెకానిక్గా మారిన ఆదిలక్ష్మికి ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేయూతనిచ్చారు.
ఆదిలక్ష్మిని ఆదివారం(జనవరి 31) హైదరాబాద్లోని తన నివాసానికి పిలిచి ఆతిథ్యమిచ్చారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి,ఆమె పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఆదిలక్ష్మి,ఆమె భర్త నిర్వహిస్తున్న మెకానిక్ షెడ్డు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆదిలక్ష్మి మెకానిక్ షాపుకు అవసరమైన యంత్ర సామాగ్రిని తాను అందిస్తానని కవిత ఆమెకు హామీ ఇచ్చారు. అంతేకాదు,ఆమె ఇద్దరు పిల్లలను చదివించే బాధ్యత కూడా తానే తీసుకుంటానన్నారు. ఎమ్మెల్సీ కవిత చేయూతకు ఆదిలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత అంజనాపురంలో ఖమ్మం రహదారి పక్కనే ఆదిలక్ష్మి,ఆమె భర్త మెకానిక్ షెడ్డు నిర్వహిస్తున్నారు. మొదట్లో ఆమె భర్త మాత్రమే ఆ పనిచేసేవాడు. కానీ లాక్ డౌన్ కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు,పిల్లల చదువులు భారమవడంతో ఆదిలక్ష్మి కూడా భర్తకు వెన్నుదన్నుగా మెకానిక్ వృత్తిలోకి దిగింది. క్రమ క్రమంగా పని నేర్చుకుని... భర్త ఇతర పనుల మీద బయటకెళ్లినా సరే ఆమె స్వయంగా వాహనాలకు మరమ్మత్తులు చేసే స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఉన్న చిన్న షెడ్డు నుంచి పెద్ద షెడ్డులోకి షాపును మార్చాలని ఆమె భావించింది. అయితే మెకానిక్ యంత్రాల కొనుగోలుకు తగినంత డబ్బు లేకపోవడంతో ఏం చేయాలో ఆ దంపతులకు తోచలేదు. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ కవిత ఆదిలక్ష్మి కష్టాల గురించి తెలుసుకుని... ఆమెకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.