ఎంఎల్ సీ ఎన్నికలు: రాడో వాచీలు, స్కాచ్ బాటిళ్లు
బెంగళూరు: కర్ణాకటలో ఎంఎల్ సీ ఎన్నికలు ఊపందుకున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకుందామని నాయకులు నానా పాట్లు పడుతున్నారు. అందుకు భారీగా ఖరీదైన బహుమతులు అందిస్తున్నారు.
భారీగా బహుమతులు అందుకుంటున్న ఓటర్ల మతిపోతుంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు బహుమతులు ఇవ్వడంలో పోటాపోటి పడుతున్నారు. రాడో వాచీలు, స్కాచ్ విస్కీ బాటిల్స్ అందిస్తున్నారు.
వీటితో పాటు పలువురు అభ్యర్థులు ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లు, ఐ పాడ్ లు బహుమతులుగా అందిస్తున్నారు. దీంతో ఎంఎల్ సీలుగా పోటి చేస్తున్న అభ్యర్థులు రూ. 20 వేల వరకు ఖర్చు పెట్టి ఓటర్లుకు రాడో వాచీలు అందిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో 25 ఎంఎల్ సీ స్థానాలకు ఈనెల 27వ తేదిన ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రచారంలో తలమునకలైనారు. కర్ణాటకలోని దారవాడ, బాగల్ కోటే, విజయపుర (బీజాపూర్ )తదితర జిల్లాల్లో ఐ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు పంపిణి చేశారు.
ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు జిల్లాలో పోటీ చేస్తున్న నాయకులు ఏకంగా రాడో వాచీలు పంపిణి చేసి ఓటర్లకు దిమ్మెతిరిగేలా చేస్తున్నారు. కర్ణాటక ఊటీగా పేరు తెచ్చుకున్న కోడుగు జిల్లాలో జానీ వాకర్ విస్కీ బాటిల్స్ పంపిణి చేశారు.
ఎంఎల్ సీ ఎన్నికల్లో ప్రాంతాల వారిగా 800 నుంచి 10,000 మంది వరకు ఓటర్లు ఓటు హక్కువినియోగించుకుంటున్నారు. 25 స్థానాల్లో ఎక్కువ మందిని గెలిపించుకోవాలని అధికార పార్టీ కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. బీజేపీ సైతం వారికి గట్టిపోటి ఇస్తున్నది. జేడీఎస్ నామమాత్రంగానే ఉంది.