మరో కీలక పరిణామం: శరద్ పవార్ను కలిసిన రాజ్థాక్రే
ముంబై: ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో రాజకీయంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగా పోటీ చేసిన శివసేన.. ఇప్పుడు తమకు రెండున్నరేళ్లపాటు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే ప్రభుత్వ ఏర్పాటు సహకరిస్తామని బీజేపీకి తేల్చి చెప్పింది.
మహారాష్ట్ర సీఎంగా శివసేన అభ్యర్థే ఉంటారు: సంజయ్ రౌత్ షాకింగ్ స్టేట్మెంట్
అయితే, బీజేపీ మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తానే ఉంటానని దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే ప్రకటించారు. మంత్రివర్గంలో చేర్చుకుంటాం కానీ, సీఎం పదవి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
తాజాగా, ఉద్ధవ్ థాక్రే సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ను కలవడం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దాదాపు 15 నిమిషాలపాటు శరద్ పవార్తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు రాజ్ థాక్రే.
అయితే, వీరి భేటీకి సంబంధించిన వివరాలు మాత్రం తెలియరాలేదు. శివసేన ప్రభుత్వం ఏర్పాటు సహకరించాలని శరద్ పవార్ను కోరేందుకు ఏమైనా రాజ్ థాక్రే కలిశారా? అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? లేక మిత్ర పక్షమైనా బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తుందా? అనేది తేలాల్సి ఉంది.
కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు రాగా, శివసేనకు 56, కాంగ్రెస్ పార్టీకి 44, ఎన్సీపీకి 54 సీట్లు వచ్చాయి. 103 స్థానాల్లో పోటీ చేసిన ఎంఎన్ఎస్ కేవలం ఒక స్థానంలోనే విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 145 మంది ఎమ్మెల్యేలను కలిగివుండాలి.