పాక్ తారలు కాదు, మీకు దమ్ముంటే, లాహోర్ వెళ్లి ?
ముంబై: పాకిస్తాన్ తారలు 48 గంటల్లో భారత్ విడిచి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసిన మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్)పై సమాజ్ వాది పార్టీ (ఎస్పీ) మహారాష్ట్ర అధ్యక్షుడు, శాసన సభ్యుడు అబు అజ్మీ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ తారలను దేశం నుంచి తరిమికొట్టడం కాదు మీకు దమ్ముంటే లాహోర్, కరాచీలకు ఆత్మాహుతి దళాలను పంపించి దాడులు చేయించాలని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రేకు సవాలు విసిరారు.
అంతే కాని చట్టబద్దంగా వీసాలతో భారతదేశానికి వచ్చిన తారల మీద మీ ప్రతాపం చూపించడం కాదు అని అన్నారు. పాకిస్తాన్ నుంచి భారత్ కు వచ్చే ప్రజలను భయపెట్టడం పనిగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు.
పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు ఉరీలో సైనికుల మీద దాడి చేశారని గుర్తు చేశారు. మీకు నిజంగా దేశభక్తి ఉంటే మీ సూసైడ్ బాంబర్లను లాహోర్, కారాచీలకు పంపించి దాడులు చేయించాలని సూచించారు.
పాకిస్తాన్ పై పోరాడటానికి మీరు సిద్దంగా ఉన్నారా అని అబు అజ్మీ ప్రశ్నించారు. పాకిస్తాన్ మాటలు పక్కన పెట్టి మొదట మీరు మహారాష్ట్ర సంగతి చూసుకోండి అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు.
పాకిస్తాన్ వరకు ఎందుకు, గడ్చి రోలి, చంద్రాపూర్ లో భద్రతా దళాలు, పోలీసుల మీద నక్సల్స్ దాడులు చేశారని, అక్కడికైనా మీ ఎంఎన్ఎస్ కార్యకర్తలను పంపించి భద్రతా దళాలు, పోలీసులను రక్షించడానికి ప్రయత్నించాలని సలహా ఇచ్చారు.
భారత్ లో భద్రతా దళాలు, పోలీసులను మీరు రక్షించి మీ దేశభక్తిని చాటుకోవాలని అబు అజ్మీ సవాలు విసిరారు. మీరు అలా ప్రయత్నిస్తే కచ్చితంగా మీరు దేశభక్తులు అని నేను అర్థం చేసుకుంటాను అని ఆయన వ్యాఖ్యానించారు.
రాజ్ థాక్రే వ్యాఖ్యలపై బాలీవుడ్ ప్రముఖ దర్శకులు విక్రమ్ భట్, హన్సల్ మెహతా స్పందించారు. కళాకారులు, క్రికెటర్లను టార్గెట్ చేయడం సరికాదని విక్రం భట్ ఓప్రముఖ మీడియా సంస్థకు చెప్పారు.
మరో దర్శకుడు హన్సల్ మెహతా ట్విట్టర్ లో పాక్ తారలపై చేసిన వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేశారు. పాక్ తారలు 48 గంటల్లో భారత్ వదిలి వెళ్లిపోవాలని శుక్రవారం ఎంఎన్ఎస్ హెచ్చరించిన విషం తెలిసిందే. ఇప్పుడు ఎంఎన్ఎస్ వ్యాఖ్యలపై పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు స్పందిస్తున్నారు.