టాంజానియా విద్యార్థిని దుస్తులిప్పేసి కొట్టారు
బెంగళూరు: ఆఫ్రికాలోని టాంజానియాకు చెందిన 21 ఏళ్ల విద్యార్తిని ఓ గుంపు దుస్తులిప్పేసి, ఆమెను చిత్తగ్గొట్టింది. ఈ దురదృష్టకరమైన సంఘటన ఆదివారంనాడు బెంగళూరులో జరిగింది. కాలేజ్ విద్యార్థిని, ఆమె స్నేహితులను చితకబాదిన గుంపు రెండు వాహనాలకు నిప్పటించింది.
బెంగళూరు నగర శివార్లలోని హెసరుఘట్ట ప్రాంతంలో ఈ ఘటనలో తీవ్రగాయాలైన బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తూర్పు ఆఫ్రికాకు చెందిన యువతి బెంగళూరు చేరుకుని నివాసం ఉంటూ ఆచార్య కాలేజ్ బీబీఏ ద్వితీయ సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్నది.
ఆదివారం రాత్రి కారు డ్రైవర్ సుందరేషన్ తో కలిసి ఆమె బయలుదేరింది. హెసరుఘట్ట సమీపంలో కారు అదుపుతప్పి పాదచారిని డీకొనడంతో 35 సంవత్సాల వ్యక్తి మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ సుందరేషన్ అక్కడి నుంచి పరారైనాడు.
కాలేజ్ విద్యార్థిని స్థానికులకు చిక్కింది. స్థానికులు ఆమెను పట్టుకుని చితకబాదేశారు. బట్టలు చింపి రోడ్డు మీద పడేశారు. ఆమెకు సహాయం చెయ్యడానికి టీ-షర్టు ఇవ్వడానికి వెళ్లిన వ్యక్తి మీద దాడి చేశారు. విషయం తెలుసుకున్న కాలేజ్ విద్యార్థిని స్నేహితులు నలుగురు కారులో అక్కడికి వెళ్లారు.
ఆ నలుగురు ఆఫ్రికా దేశస్తులే. స్థానికులు ఆ నలుగురిని కారులో నుంచి బయటకులాగి ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. కాలేజ్ విద్యార్థిని అటువైపు వెళుతున్న బీఎంటీసీ బస్సు ఎక్కి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. అయితే బస్సులోని ప్రయాణికులు ఆమెను కిందకు నెట్టివేశారు.
కాలేజ్ యువతి వెళ్లిన కారు, ఆమె స్నేహితులు వెళ్లిన కారుకు నిప్పంటించారు. రెండు వాహనాలు భూడిద అయ్యాయి. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
అయితే ప్రమాదానికి కారణం అయిన కారు డ్రైవర్ ను పిలుచుకుని వస్తే మీ ఫిర్యాదు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ఆల్ ఆఫ్రిక్ స్టూడెంట్స్ ఇన్ బెంగళూరు సంస్థ సహకారంతో బాధితులు బెంగళూరులోని ఆఫ్రికా రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.