లేడీస్ టాయ్ లెట్ లో కెమెరా : సంచలనం రేకిత్తిస్తోన్న వీడియో లీకేజీ..
మంగళూరు : మొబైల్ కెమెరాలు వచ్చిన తర్వాత.. ఏ నట్టింటి వీడియో ఇంటర్నెట్ లోకి ఎక్కుతుందో తెలియని పరిస్థితి. టెక్నాలజీని దుర్వినియోగం చేసేవారు పెరిగిపోతున్న నేపథ్యంలో.. బెడ్ రూముల్లోను, లేడీస్ బాత్రూమ్ ల్లోను కెమెరాలు దూరిపోతున్న దుస్థితి ఈమధ్య తరచు వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది.
తాజాగా మంగళూరు యూనివర్శిటీలోని విద్యార్థినుల టాయ్ లెట్ లో మొబైల్ కెమెరా ఉన్నట్లు తేలడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాలు బయటకు లీక్ అవడంతో వర్శిటీ విద్యార్థినుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
కాగా, విద్యార్థినుల టాయ్ లెట్ లో కెమెరా అమర్చిన విషయాన్ని గత నెల 24వ తేదీన గుర్తించారు. ఈ కెమెరాలో రికార్డయిన దాదాపు 45 నిమిషాల నిడివిగల వీడియో క్లిప్పింగులను ఆగస్టు 7, 11 తేదీల్లో బయటకు లీక్ చేశారని పోలీసులు ధ్రువీకరించారు .
దర్యాప్తులో భాగంగా.. ప్రస్తుతం మొబైల్ కెమెరాలో రికార్డయి ఉన్న వీడియో క్లిప్పింగులను బెంగళూరులోని సైబర్ క్రైంబ్రాంచి అధికారులకు పంపించారు పోలీసులు. తీవ్ర సంచలనానికి దారి తీసిన ఈ కేసులో ముగ్గురు వర్శిటీ విద్యార్థులు, మరికొంతమంది ఉద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు. అయితే.. బెంగళూరు సైబర్ క్రైం సెల్ నుంచి నివేదిక వస్తే.. కేసులో అసలు నిందితులు ఎవరన్నది తేలుతుందని పోలీసులు చెబుతున్నారు.