జమ్మూకశ్మీర్లో మొబైల్ ఫోన్ సేవల పునరుద్ధరణ ఎప్పుడంటే?
గత రెండు నెలలుగా జమ్ముకశ్మీర్లో భద్రతాపరమైన కారణాలతో పోస్ట్పెయిడ్ మొబైల్ ఫోన్లు వినియోగంపై ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం శనివారం ఆ ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు తొలుత పేర్కొంది. అయితే తాజాగా సోమవారం నుంచి మొబైల్ ఫోన్ సేవలు వినియోగించుకోవచ్చంటూ ప్రభుత్వం తెలిపింది. గత 69 రోజులుగా జమ్మూ కశ్మీర్లో మొబైల్ ఫోన్ వినియోగంపై ఆంక్షలు విధించింది కేంద్రం.
సోమవారం నుంచి మొబైల్ ఫోన్ సేవల పునరుద్ధరణ
సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మొబైల్ ఫోన్ కనెక్షన్లపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు మీడియా సమావేశం ద్వారా తెలిపారు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రోహిత్ కన్సాల్. ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ దేశాల నుంచి ప్రభుత్వంపై వస్తున్న ఒత్తిడితోనే ప్రభుత్వం ఈ చర్యకు పూనుకునుందని అన్నారు. కశ్మీర్లో మొబైల్ ఫోన్ సేవలు నిలిచిపోవడంతో అక్కడ నివాసముంటున్న 70 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం మొబైల్ ఫోన్ వినియోగంపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయడం తప్ప మరో దారి కనిపించలేదు.
ఒత్తిడితోనే ప్రభుత్వం దిగొచ్చిందా..?
ఒకానొక సమయంలో కేవలం ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ పై మాత్రమే ఇన్కమింగ్ మరియు ఔట్గోయింగ్ కాల్స్కు అనుమతించి ఇతర ప్రైవేట్ నెట్వర్క్లపై ఉన్నవారికి కేవలం ఇన్కమింగ్ కాల్స్ మాత్రమే యాక్టివేట్ చేయాలని ప్రభుత్వం భావించింది. ఇలా అయితే తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావించి అన్ని ఆపరేటర్లపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ ప్రకటన చేసింది. దీంతో కశ్మీర్లోయలో 40 లక్షల మంది మొబైల్ ఫోన్ వినియోగదారులకు ఊరట లభించినట్లయ్యింది. శనివారమే వీటిపై ఆంక్షలు ఎత్తివేయాల్సి ఉన్నప్పటికీ... చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దీన్ని సోమవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
మొబైల్ ఫోన్లు లేకుంటే ఆసక్తి చూపని పర్యాటకులు
ఇక జమ్మూకశ్మీర్లో పర్యాటకులను అనుమతించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్లు పనిచేయకపోతే జమ్ముకశ్మీర్కు పర్యాటకులు రావడం లేదని టూరిస్ట్ ఏజెన్సీలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆగష్టు 5వ తేదీన మొబైల్ ఫోన్ సేవలను కేంద్ర నిలిపివేసింది. ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్లు ప్రకటించగానే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడి మొబైల్ ఫోన్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. ఆగష్టు 17న కొన్ని ఫిక్స్డ్ ల్యాండ్లైన్లు వినియోగంకు ప్రభుత్వం ఓకే చెప్పింది. సెప్టెంబర్ 4వ తేదీ నాటికి అన్ని ల్యాండ్ ఫోన్లపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ మొబైల్ ఫోన్లపై మాత్రం ఆంక్షలను కొనసాగించింది.