ఆస్పత్రుల్లో మొబైల్ ఫోన్స్ బ్యాన్ ... రీజన్ చెప్పి మండిపడిన కేంద్ర మంత్రి
కరోనాతో దేశం విలవిలలాడుతుంది. కరోనా బాధితులను కాపాడటం కోసం , అలాగే కరోనా వ్యాప్తిని అరికట్టటం కోసం అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇక ఈ నేపధ్యంలోనే ఆస్పత్రుల్లో మొబైల్ ఫోన్ల వాడకం పట్ల చోటు చేసుకున్న సంఘటన పశ్చిమ బెంగాల్ సర్కార్ తీవ్ర నిర్ణయం తీసుకునేలా చేసింది . హాస్పిటల్ లోపల మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో హాస్పిటల్స్ లో మొబైల్ ఫోన్స్ బ్యాన్
హాస్పిటల్స్ లో సెల్ ఫోన్లు అనుమతించం అని , అయితే రోగుల సహాయార్థం ల్యాండ్ లైన్స్ ఏర్పాటు చేస్తామని పశ్చిమబెంగాల్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రాజీవా సిన్హా తెలిపారు. కోల్కతాలోని బాంగూర్ హాస్పిటల్లో కరోనా పాజిటివ్ పేషెంట్స్ ఉన్న ఐసోలేషన్ వార్డులో రెండు మృతదేహాలను వైద్య సిబ్బంది గంటల కొద్ది అలాగే వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలా మంది కరోనా రోగులు రెండు మృతదేహాలకు చాలా దగ్గర్లోనే కూర్చొని ఉన్నారు.
ఆస్పత్రిలో కరోనా మృతదేహాలను వదిలిపెట్టి నిర్లక్ష్యం వహించిన వైద్యుల వీడియో వైరల్
అయినప్పటికీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలో వారు మృతదేహాలను తక్షణమే తీసెకెళ్లాల్సిందిగా బాధితులు మొర పెట్టుకున్నా సిబ్బంది పట్టించుకోలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడే ఉన్న ఓ కరోనా రోగి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ అయ్యింది. ఇక ఈ వ్యవహారం ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. ప్రభుత్వం కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవట్లేదంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు.దీంతో మమత సర్కార్ ఆస్పత్రుల్లో మొబైల్ ఫోన్లు బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది .
వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోకుండా మొబైల్ ఫోన్లు బ్యాన్ చేసిన మమత సర్కార్
ఇక ఈ ఘటనపై స్పందించాల్సిన మమత సర్కార్ హాస్పిటల్స్ లో ఫోన్లు బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకోవటం దారుణం అని కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో మండిపడ్డారు. ఇక ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ వీడియో వైరల్ కావడంతోనే హాస్పిటల్స్ లోపల మొబైల్ ఫోన్లను నిషేధించారని మమత సర్కార్పై ఆరోపణలు గుప్పించారు. వైద్య సిబ్బంది నిర్వాకం , ప్రభుత్వ అసమర్ధత కప్పిపుచ్చుకునేందుకే మమత ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు . నిజాలను నొక్కిపెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ చర్యకు పూనుకున్నట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు .
ఆ వీడియో ట్వీట్ చేసి మండిపడిన కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో
అంతేకాకుండా ఈ వైరల్ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన కేంద్ర మంత్రి ఇంత జరుగుతున్నా మమతా బెనర్జీ మాత్రం దీనిపై స్పందించట్లేదని, కనీసం అది నకిలీ వీడియో అని చెప్పడానికి కూడా ముందుకు రావట్లేదని ఆయన పేర్కొన్నారు . దీన్ని బట్టి ఈ వీడియో నిజం అని నమ్మడానికి ఆస్కారం ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఏది ఏమైనా కరోనా తీవ్రంగా అన్ని రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్న వేళ జరుగుతున్న తప్పులను దిద్దుకుంటూ ముందుకు సాగాల్సిన వేళ తప్పులు బయటకు రాకుండా నొక్కి పెట్టే ప్రయత్నం మమత సర్కార్ చేస్తుందని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో మండిపడుతున్నారు.