మీ మొబైల్ ఫోన్లు మంచి కరోనా వాహకాలు! జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతులు
న్యూఢిల్లీ: ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(రాయ్పూర్)కు చెందిన వైద్యులు సంచలన విషయాలను వెల్లడించారు. కరోనావైరస్ వ్యాప్తికి మొబైల్ ఫోన్లు కూడా మంచి వాహకాలుగా పని చేస్తున్నాయని తెలిపారు. మరీ ముఖ్యంగా ఆస్పత్రుల్లో పనిచేసేవారు అక్కడకు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు.
మొబైల్ ఫోన్తో కరోనా..
ముఖం, నోటి నుంచి నేరుగా మొబైల్ ఫోన్ ఉపరితలంపైకి వైరస్ వచ్చి చేరుతున్నట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు. తరచూ చేతులు శుభ్రం చేసుకుంటున్నా.. సగటున మొబైల్ వినియోగం ఎక్కువగా ఉండటంతో వైరస్ వ్యాప్తి కూడా అందుకు తగినట్లే ఉందంటున్నారు. కరోనా నివారణకు డబ్ల్యూహెచ్ఓ సహా అనేక సంస్థలు మార్గదర్శకాలను విడుదల చేశాయి.
మొబైల్ ఫోన్ల విషయంలో..
అయితే, అవేవీ కూడా మొబైల్ ఫోన్ వినియోగంపై పెద్దగా దృష్టి పెట్టలేదని చెప్పారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశాయి. కానీ, మొబైల్ ను శుభ్రంగా ఉంచుకోవాలని మాత్రం చెప్పలేదని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఫేస్ మాస్కు సహా అన్నింటినీ శుభ్రం చేస్తున్నా.. మొబైల్ ఫోన్ల విషయంలో మాత్రం దాన్ని పాటించడం లేదని అన్నారు.
Recommended Video
జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
ముఖ్యంగా ఆస్పత్రుల్లో పనిచేసేవారు తమ మొబైల్ ఫోన్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మన మొబైల్ ఎప్పుడూ చేతికి అనుబంధంగా ఉంటుందని, మీ చేతి ద్వారా ఏదైతే వ్యాప్తి చెందుతుందో అదే మొబైల్ పైనా ఉంటుందని చెప్పారు. ఫోన్లను ఐసోప్రోవఫైల్ ఆల్కాహాల్ కలిగిన శానిటైజర్ లేదా క్లోరాక్స్ డిస్ ఇన్ఫెక్టింగ్ వైప్స్ తో శుభపర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, దేశంలో 85,784 కేసులు నమోదు కాగా, 52,781 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 30,245 మంది కోలుకున్నారు. 2753 మందికరోనాతో మరణించారు.