మరింత పెరగనున్న మొబైల్స్ ధరలు: 12శాతం నుంచి 18 శాతానికి జీఎస్టీ
న్యూఢిల్లీ: కొత్త మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది ఖచ్చితంగా చేదువార్తే. ఎందుకంటే.. మొబైల్ ఫోన్లపై గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్(జీఎస్టీ) కౌన్సిల్ తాజాగా మొబైల్ ఫోన్లపై జీఎస్టీ పెంపునకు ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 39వ సమావేశం శనివారం జరిగింది.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొబైల్ ఫోన్లు, కొన్ని విడిభాగాలపై జీఎస్టీ రేటును 12 నుంచి 18 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొబైల్ రేట్లు పెరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కౌన్సిల్ నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి. కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాలను నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు.
యంత్రాలు, చేత్తో తయారు చేసే అగ్గిపుల్లలపై వేర్వేరుగా ఉన్న జీఎస్టీని మొత్తంగా 12 శాతానికి హేతుబద్దీకరించారు. ఎయిర్ క్రాఫ్ట్లకు సంబంధించిన మెయింటెన్స్, రిపేర్, ఓవర్ హాల్(ఎంఆర్ఓ) సేవలపై ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. అంతేగాక, రూ, కోట్లు కంటే తక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపారులు 2018, 2019 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆలస్యంగా దాఖలు చేసిన వార్షిక రిటర్నులపై ఆలస్య రుసుమును రద్దు చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
జీఎస్టీ నెట్వర్క్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు మరింత నైపుణ్యవంతులైన మానవ వనరులను సమకూర్చాలని ఇన్ఫోసిస్కు సూచించారు. జులై 2020 నాటికి జీఎస్టీ నెట్ వర్క్స్ మెరుగుపర్చాలని నిర్మలా సీతారామన్ కోరారు. కాగా, ఫెర్టిలైజర్స్, ఫుట్వేర్ వంటి వాటిపై కూడా జీఎస్టీ పెంపు ప్రతిపాదనలపై చర్చ జరగ్గా.. ప్రస్తుత ఆర్థి మందగమనం, కరోనావైరస్ ప్రభావం కారణంగా.. ఎరువులు, పాదరక్షలు, వస్త్రాలపై పెంపు ప్రతిపాదనను కౌన్సిల్ వాయిదా వేసింది.
కాగా, తాజా ప్రభుత్వ నిర్ణయం వినియోగదారులతోపాటు, స్థానిక ఉత్పత్తిదారులకు కూడా హానికరమని మొబైల్ హ్యాండ్సెట్లు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ సంస్థ ఆర్తిక మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత స్థాయి 12శాతం నుంచి మొబైల్ ఫోన్ల జీఎస్టీరేటు పెరుగుదలకు ఇది సరైన సమయం కాదని వ్యాఖ్యానించింది. మొబైల్ ఫోన్లు, విడి భాగాలపై జీఎస్టీ పెంపుద్వారా మరోసారి ఇబ్బందులు సృష్టించడం సరికాదని ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మొహింద్రూ అన్నారు.