మాక్ డ్రిల్లో విషాదం: 2వ అంతస్థు నుంచి తోసేశాడు, అమ్మాయి మృతి
Recommended Video
కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరులోని ఓ కాలేజీలో ఘోరం జరిగింది. మాక్ డ్రిల్ కారణంగా ఓ విద్యార్థిని ప్రాణం పోయింది. జిల్లాలోని నర్సీపురంలోని కోవై కలైమగల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అగ్ని ప్రమాద సమయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు.
తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన ఫైర్ సేఫ్టీ బృందం సుమారు ఇరవై మంది విద్యార్థులను మాక్ డ్రిల్ కోసం ఎంపిక చేసింది. నలభై రోజులుగా శిక్షణ ఇచ్చారు. గురువారం మధ్యాహ్నంతో విద్యార్థులను ఒక్కొక్కరిని రెండో అంతస్తు నుంచి కిందకు దూకించారు. కింద విద్యార్థుల సాయంతో వారిని రక్షిస్తూ వచ్చారు.
ఆసుపత్రికి తరలించేలోగా మృతి
ఈ క్రమంలో లోగేశ్వరి (19) ఏళ్ల బీబీఏ విద్యార్థినిని కోచ్ లేదా ట్రెయినర్ కిందకు తోశాడు. ఆమెను తోసింది కోచ్. అయితే అప్పటికి ఆ విద్యార్థి అప్రమత్తంగా లేదు. దీంతో కింద ఫ్లోర్ సెల్ఫ్కు తల బలంగా తాకి కుప్పకూలిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
బోరుమన్న తల్లిదండ్రులు
లోగేశ్వరి స్వస్థలం అలందూరి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి వచ్చారు. కూతురును చోసి బోరున విలపించారు. తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరు అయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి లోగేశ్వరి మృతికి కారణమైన కోచ్ ఆర్ముగంను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు.
తోసేసిన కోచ్
విద్యార్థులందరినీ రెండో అంతస్తు నుంచి కిందకు దూకాలని చెప్పారు. ఇలా దూకడానికి లోగేశ్వరి బయపడిందని తెలుస్తోంది. ఆమె భయపడుతుండటంతో కోచ్ ఆర్ముగం కిందకు తోసేశాడని అంటున్నారు. దాంతో తల మొదటి అంతస్తు గోడ అంచుకు తగిలి రక్తస్రావమై, చనిపోయింది.
కొందరు వీడియో తీశారు
మరోవైపు, లోగేశ్వరి తోయమని చెబితేనే తాను తోసేశానని కోచ్ ఆర్ముగం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి అక్కడి విద్యార్థులు కొందరు వీడియో తీశారు. ట్రయినర్ బలవంతంగా తోసేశాడని కొందరు విద్యార్థులు చెప్పారు.