‘మిత్రపక్షం టీడీపీ ఎందుకు అవిశ్వాసం పెట్టింది?’: మోడీ, షాలను నిలదీసిన ఉద్దవ్
ముంబై: శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజుల వరకు కూడా మిత్రంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ఎందుకు పెట్టిందో ఆధునిక చాణక్యులు చెప్పాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలను ఉద్దేశించి డిమాండ్ చేశారు.
బీజేపీపై అవిశ్వాసం పెట్టిన టీడీపీ తమకు మిత్రపక్షమే కదా అని ప్రశ్నించారు. మిత్రులు కూడా మీ(బీజేపీ)పై అవిశ్వాసం పెడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ఓ మిత్రపక్షం అవిశ్వాసం పెట్టడం దేశ చరిత్రలోనే ఇది ప్రథమమని ఉద్దవ్ ఎద్దేవా చేశారు.
అవిశ్వాసంపై చర్చ సందర్భంగా సభకు గైర్హాజరు కావడంపై కూడా ఉద్దవ్ స్పందించారు. తాము ఎవరిపై విశ్వాసం చూపాలని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు కూడా చేస్తున్నదని ఏముందని నిలదీశారు. ప్రజలను ప్రభావితం చేసే అంశాలపై విపక్షాలు మాట్లాడుతున్నాయా? అని ప్రశ్నించారు.
దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మూక దాడులు పెరుగుతున్నాయని ఉద్ధవ్ థాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. ఆవులను కాపాడితే సరిపోదు, మహిళలకు కూడా రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఓట్ల రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.