రైతులపై ఝుళిపించిన లాఠీ మోదీ ఛరిష్మాను మసకబారేట్టు చేసింది..!!
హైదరాబాద్/ ఢిల్లీ : రాజకీయాల్లో అన్నీ పరిస్థితులూ అనుకూలంగా ఉన్నాయని ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడూ రిలాక్స్ అవ్వడానికి వీలుండదు. ప్రమాదం, ఆపద, ముప్పు, అప్రదిష్ట, వ్యతిరేకత,కీడు ఎప్పుడు ఏ మూలనుండి వచ్చి మీదపడుతుందో తెలియని పరిస్థితులు నెలకొంటాయి. శిఖరమంత ఎదిగిని ఖ్యాతి చిన్న కారణంతో భూస్థాపితం అవుతుందన్నట్టు, రాజకీయాల్లో అప్రమత్తంగా ఉండకపోయినా, సమయోచిత నిర్ణయాలు తీసుకోక పోయినా ఇటుక ఇటుక పేర్చి అందంగా నిర్మించిన అపురూప సౌధం కూడా బీటలు వారాల్సిందే..! ప్రస్తుతం ఢిల్లీలో రైతులపై ప్రయోగించిన భాష్పవాయువు, లాఠీ ఛార్జీతో ప్రధాని మోదీ ఛరిష్మాను మసకబారేలా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదనే వాదన వినిపిస్తోంది.
Recommended Video
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ట కు మచ్చ..! ఆ లాఠీ ఛార్జ్..!!
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ట రోజురోజుకీ మసకబారుతోందా ? నాలుగున్నర ఏళ్ల క్రితం నరేంద్ర మోదీ పనితనాన్ని చూసి ప్రశంసలు కురిపించిన దేశ ప్రజలు ఇప్పుడు పెదవి విరుస్తున్నారా? అంటే అవును అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన పట్ల ప్రజలలో వ్యతిరేకతే తప్ప అనుకూలత రావటం లేదని అంటున్నారు. ఇదే విషయాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ స్ధాయి నాయకులు కూడా అంగీకరిస్తున్నారు.
50 రోజుల్లో మార్పు తెస్తానన్న మోదీ మాట మార్చారు..!!
ప్రధానిగా ఏదో అసాద్యాన్ని సుసాద్యం చేస్తారనుకుంటే పార్టీని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసారని వ్యాఖ్యానిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయాన్ని తీసుకున్న నరేంద్ర మోదీ పట్ల పార్టీలోను, ప్రజలలోను తొలి రోజులలో మంచి అభిప్రాయమే ఉండేది. అయితే ఆ సాహస నిర్ణయాన్ని అమలు చేయడంలో మాత్రం ప్రధాని విఫలమయ్యారని, ఆ రోజు నుంచే ఆయన ప్రతిష్ట మసక బారిందని అంటున్నారు. 50 రోజుల్లో మార్పు చూపకపోతే ఉరితీయండి అని, 500 రోజుల తర్వాత కూడా ఆయన ఏ మార్పూ చూపలేదు. ప్రధానిగా ప్రజలలో పట్టు తగ్గిపోతోందన్న విషయాన్ని నరేంద్ర మోదీకి చెప్పినా ఆయన ఖాతరు చేయలేదని పార్టీలో సీనియర్లు అంటున్నారు.
నోట్ల రద్దు విఫలమే..! ఇంకా ఇబ్బందిగా మారిన ఏటీయంలు..!!
నోట్ల రద్దు తర్వాత ప్రధాని ప్రతిష్టతను మరింతా దిగజార్చింది జీఎస్టీ అమలేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నిర్ణయంపై కూడా ఎవరితోను చర్చించకుండా తీసుకోవడం వల్ల మరింత చేటు వచ్చిందని అంటున్నారు. ఈ రెండు నిర్ణయాలతో సతమతమవుతుంటే రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు అంశం అటు ప్రధానిని, ఇటు పార్టీ ప్రతిష్టను దిగజార్చిందని అభిప్రాయ పడుతున్నారు. అవినీతి వ్యతిరేకి అన్న ఏకైక కారణమంతో అందరికీ మంచి అభిప్రాయం ఉండేదని, ఆయనపై కూడా ఆరోపణలు రావడంతో ఏ రాయి అయినా ఒకటే అని ప్రజలు ఫీలవుతున్నారట. బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్య, నిరవ్ మోదీ వల్ల కూడా పార్టీ, ప్రధాని పరువు బజారున పడిందనే అభిప్రాయం వ్యక్తం మవుతోంది.
విజయ్ మాల్య, నిరవ్ మోదీ ల ప్రభావం కేంద్రంపై పడింది...!
వీటికి తోడు తాజాగా రైతులపై ఝుళిపించిన లాఠీ కూడా ప్రధాని ప్రతిష్టకు మచ్చ తెచ్చిందంటున్నారు. దేశంలో అన్నదాతలపై నిరంకుశంగా వ్యవహరించిన వారందరికీ రాజకీయంగా అధోగతే పట్టిందని రాజకీయ పండితులు అంటున్నారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా మినహాయింపు కాదని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు 9 నెలలే గడువున్న ఈ సమయంలో తన ప్రతిష్టను, పార్టీ మనుగడను ఎలా కాపాడతారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నేటి ఈ పరిస్థితికి ప్రధాని ఒక్కరే బాధ్యులు కారని, పార్టీలో ఓ వర్గం అంటోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా తీసుకున్న నిర్ణయాలు కూడా నేటి ఈ దుస్థితికి కారణమని వ్యాఖ్యానిస్తున్నారు.