మోడీ, అమిత్ షా మార్క్.. బార్మేర్ ఎంపీ కైలాశ్ చౌదరికి మంత్రిగా ఛాన్స్
ఢిల్లీ : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడంతో పార్లమెంటుకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు కేంద్ర మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఆ క్రమంలో 42 మందితో మోడీ కేబినెట్ కూర్పు జరుగుతుండగా.. అందులో 13 మందికి కొత్తగా అవకాశం ఇవ్వడం విశేషం. రాజస్థాన్ లోని బార్మర్ పార్లమెంటరీ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందిన కైలాశ్ చౌదరికి.. మోడీ కేబినెట్లో స్థానం దక్కింది.
రాజస్థాన్లోనే అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గమైన బార్మేర్ నుంచి బీజేపీకి అత్యంత కీలకమైన విజయం దక్కిందని చెప్పొచ్చు. బీజేపీలో కీరోల్ పోషించిన వ్యవస్థాపక సభ్యుడు జశ్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ మీద కైలాశ్ విజయం సాధించడం విశేషం. జశ్వంత్ సింగ్ కు బార్మేర్ నియోజకవర్గంతో వీడదీయలేని అనుబంధం ఉంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కుమారుడు మానవేంద్ర సింగ్.. బీజేపీ నుంచి పోటీ చేసిన కైలాశ్ చౌదరి మీద ఈజీగా గెలిస్తారని అందరూ భావించారు.
మోడీ కేబినెట్లో దేవశ్రీకి ఛాన్స్.. అమిత్ షా మాట మీద నిలబడ్డారుగా..!
బీజేపీ తన తండ్రిని అవమానించిందనే కారణంతో మానవేంద్ర సింగే గతేడాది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో బీజేపీ అనూహ్యంగా కైలాశ్ చౌదరిని తెరపైకి తెచ్చింది. 2018 డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కైలాశ్ ఓడిపోయారు. అయినప్పటికీ సంఘ్ పరివార్ సూచనతో ఆయనకే టికెట్ ఇచ్చారు బీజేపీ అగ్రనేతలు. సిట్టింగ్ ఎంపీ సోనా రామ్ ను పక్కనబెట్టి కైలాశ్ చౌదరికి టికెట్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదలావుంటే మానవేంద్ర సింగ్ పై అనూహ్యంగా కైలాశ్.. 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీ సాధించడం విశేషం.
మోడీ కేబినెట్ లో తనకు బెర్త్ దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు కైలాశ్ చౌదరి. మోడీ ప్రభుత్వ ఏర్పాటుతో దేశ పురోగతికి కొత్త ప్రమాణాలకు మరో దారి ఏర్పడినట్లేనని పేర్కొన్నారు. అయితే ఆయనకు మంత్రి పదవి దక్కడంపై అక్కడి పార్టీశ్రేణులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అది మోడీ, అమిత్ షా మార్క్ అని తెగ సంబరపడిపోతున్నారు.