యూపీ విజయ రహస్యం ఇదే: బిజెపి 14 ఏళ్ల వనవాసానికి స్వస్తి
దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 14 ఏళ్ల విరామం (వనవాసం) తర్వాత బిజెపి మూడింట మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటుకు దాదాపు రంగం సిద్ధమైంది.
లక్నో: దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 14 ఏళ్ల విరామం (వనవాసం) తర్వాత బిజెపి మూడింట మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటుకు దాదాపు రంగం సిద్ధమైంది. ప్రస్తుత రాజస్థాన్ గవర్నర్గా ఉన్న కల్యాణ్ సింగ్ తర్వాత సొంత బలంపై బీజేపీ యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.
ఇక 2014 లోక్ సభ ఎన్నికల తర్వాత ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్రమోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా జంట నాయకత్వం.. ప్రధానంగా యూపీ అసెంబ్లీ ఎన్నికలపై నిశిత ద్రుష్టి సారించింది.
లోక్సభ ఎన్నికల మాదిరిగానే అమిత్ షా ఉత్తరప్రదేశ్ రాష్ట్రమంతా కలియ దిరుగుతూ వివిధ కుల సమీకరణాల ప్రాతిపదికన ప్రధానంగా యాదవేతర ఓబీసీలు.. కుర్మీలు (పటేళ్లు), కుశ్వాహాలు, రాజ్పుత్రులు, బనియాలు, లోదీలను.. దళితుల్లో జాతవేతరులను ఆకర్షించడంపై ప్రధానంగా ద్రుష్టి సారించారు. ఓబీసీల మనస్సు చూరగొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకొకటి చొప్పున ఓబీసీ సదస్సు నిర్వహించింది.
‘కమలం'లో యాదవేతర ఓబీసీలకు అగ్రస్థానం
యాదవేతర ఓబీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కుశ్వాహా సామాజిక వర్గం నాయకుడు కేశవ్ ప్రసాద్ మౌర్యను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. ఇక బీఎస్పీ నుంచి పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య వంటి నేతలకు చోటు కల్పించింది. టిక్కెట్ల కేటాయింపుల్లోనూ 36 శాతం స్థానాలను ఓబీసీలకు ఇవ్వడం ద్వారా యాదవ్ ల నేత్రుత్వంలోని ఎస్పీకి ప్రత్యామ్నాయం తామేనన్న సంకేతాలిచ్చింది బీజేపీ. మరోవైపు దళితుల్లో జాతవులకు తప్ప మిగతా ఉప కులాల వారికి మాయావతి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అభిప్రాయం ఆయా సామాజిక వర్గాల్లో ఉంది.
తమ మద్దతు దారులపైనే విపక్షాల దృష్టి
ఇటు ఎస్పీ - కాంగ్రెస్ కూటమి, అటు బీఎస్పీ కూడా దళిత, యాదవ, ముస్లిం సామాజిక వర్గాల ఓట్లపైనే ఆశలు పెట్టుకున్న సమీకరణాలు జరిపాయే గానీ, ఇతర సామాజిక వర్గాలను విశ్వాసంలోకి తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రారంభానికి మూడు నెలల ముందే అవినీతిని నిరోధించేందుకు.. నల్లధనాన్ని వెలికితీసేందుకు ప్రధాని నరేంద్రమోదీ గత నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్లు రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం సామాన్యుడిపై ప్రభావం చూపలేదని యూపీ ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి.
మోదీ, అమిత్ షా ప్రచారం తీరిలా
పశ్చిమ యూపీ బెల్టులో 20 శాతానికి పైగా ముస్లింల ఓటింగ్ ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ పూర్తయ్యే వరకు బీజేపీ.. ప్రత్యేకించి ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రచారమంతా కేవలం ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్' అన్న నినాదంతో సాగింది. ప్రత్యేకించి మధ్య యూపీ.. ములాయం - అఖిలేశ్ యాదవ్ సామాజిక వర్గం బలంగా ఉన్న అవధ్ రీజియన్లో పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ప్రధాని మోదీ ‘కబరిస్థాన్.. శ్మశాన వాటిక' వివాదం, రంజాన్ పండుగకు నిరంతర విద్యుత్ సరఫరా చేసినట్లే దీపావళి ఇతర హిందూ పర్వదినాల్లో జరుగడం లేదన్న వాదనను గట్టిగా తీసుకొచ్చారు.
ఆకట్టుకోని అఖిలేశ్ తదితరుల క్యాంపెయిన్
దీనికి కొనసాగింపుగా బీజేపీ అధ్యక్షుడు అమిత్షా.. కసబ్ కు నిర్వచనం కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ అన్న నినాదం ముందుకు తెచ్చారు. ప్రధాని మోదీ ‘కబరిస్థాన్.. శ్మశాన వాటిక', విద్యుత్ సరఫరాలో వివక్ష నినాదాలు, అమిత్ షా ‘కసబ్' వివాదానికి అఖిలేశ్ మొదలు ఆయన సతీమణి డింపుల్ యాదవ్, ఎస్పీ మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత మాయావతి ధీటుగా సమాధానమిచ్చినా ప్రజలను ఆకట్టుకోలేదని ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. దీనికి తోడు పార్టీలో అంతర్యుద్దం కారణంగా పార్టీ నాయకత్వ స్థానాన్ని లాగేసుకోవడం పట్ల కినుక వహించిన ‘నేతాజీ'.. ములాయం ముల్లా.. మూడు నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారానికి పరిమితం కావడం ఎన్నికల ఫలితాల్లో ఎస్పీ పరాజయం పాలవ్వడానికి మరో కారణంగా కనిపిస్తున్నది.
ఓటింగ్కు దూరంగా ముస్లింలు
మతతత్వ రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీకి ప్రత్నామయంగా ములాయం యూపీ ముస్లింలకు ఆశాకిరణంగా నిలిచారు. కానీ ములాయం నుంచి పార్టీ నాయకత్వాన్ని అఖిలేశ్ లాగేసుకోవడంతో ఇంటికే పరిమితం కావడం ఎస్పీ దెబ్బతిన్నది. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీతో పోటీ పడిన ఎస్పీ.. అదే పార్టీతో కలిసి పోటీ చేయడం యూపీ వాసులకు నచ్చలేదని తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పట్ల తొలిదశలోనే ములాయం తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేశారు.
స్పష్టంగా ముల్లా ములాయం గైర్హాజరు ఎఫెక్ట్
103 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎస్పీ.. మిగతా స్థానాల్లో ఎస్పీకి కాంగ్రెస్ సహకరించిన దాఖాలాలు కనిపించడం లేదు. ములాయం బహిరంగంగానే మిగతా స్థానాల్లో వ్యతిరేకులకు ఓటేయమని పిలుపునివ్వడం యూపీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని భావించక తప్పదు. తమకు సరైన ప్రత్యామ్నాయం లేనందు వల్ల ముస్లింలు చాలా చోట్ల ఓటింగ్ కు దూరంగా ఉన్నట్లు పోలింగ్ సరళి కూడా చెప్తున్నది.
ఇతర సామాజిక వర్గాల పట్ల విపక్షాల నిరాసక్తత
ఐదేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా కాంగ్రెస్, ఎస్పీ పొత్తు పెట్టుకున్నా.. అసలు సంగతి విస్మరించాయి. తండ్రి లేని లోటు కాంగ్రెస్ పార్టీ తీరుస్తుందని అఖిలేశ్.. ముస్లింల ఓట్లు సంఘటితమవుతాయని కాంగ్రెస్ పార్టీ భావించాయి. వాస్తవంగా దేశ రాజకీయాలను శాసించే యూపీ పట్ల బీజేపీ అప్రమత్తంగా ఉందని, చాపకింద నీరులా క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటున్నదన్న సంగతి పసిగట్టలేకపోయాయి. ఎస్పీకి తానే ప్రత్యామ్నాయమని తొలి నుంచి భావించిన బీఎస్పీ అధినేత మాయావతి కూడా ఈ అంశాన్ని విస్మరించారు.
క్షేత్రస్థాయి పరిస్థితులు విస్మరించిన విపక్షాలు
అంతే కాదు 2014 లోక్ సభ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన బీజేపీ.. ప్రత్యేకించి ప్రధాని మోదీ - అమిత్ షా జోడీ.. బీహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అప్రమత్తమవుతున్నారన్న సంగతి పట్టించుకోక పోవడం ఇటు అఖిలేశ్ - రాహుల్ గాంధీ జోడీకి, అటు మాయావతి నాయకత్వ సామర్థ్యం, పరిణతి లోపానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెల్లడికి ముందే కాంగ్రెస్ పార్టీ అందించిన స్నేహహస్తాన్ని తోసి రాజన్న బీఎస్పీ అధినేత మాయావతి యూపీ రాజకీయాల్లో మూడో స్థానానికి నెట్టివేయబడ్డారు.