వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని ఓడించండి, చంద్రబాబూ! మీరూ మునుగుతారు: మోడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో చిక్కుకోవద్దని చంద్రబాబుకు చెప్పాం: మోడీ

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ లోకసభలో సమాధానం ఇచ్చారు. ఓటింగ్‌కు ముందు ఆయన విభజన హామీలతో పాటు పలు అంశాలపై స్పందించారు. అవిశ్వాస తీర్మానాన్ని ఓడించాలని ఆయన ఎంపీలకు సూచించారు.

ప్రజాస్వామ్యంలో అవిశ్వాసం ఓ భాగం అన్నారు. నాలుగేళ్లలో ప్రభుత్వం చేసిన పనులను అందరూ సమర్థించారని చెప్పారు. మేం మాట్లాడితే భూకంపం వస్తుందన్న వారు చర్చకు సిద్ధం కాకుండా వచ్చారని ఎద్దేవా చేశారు. సంఖ్యాబలం లేనప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు తెచ్చారన్నది ప్రశ్న అన్నారు.

అవిశ్వాస తీర్మానం పెడితే భూకంపం వస్తుందని చెప్పారని, కానీ ఏమీ రాలేదని అభిప్రాయపడ్డారు. తమకు సంఖ్యాబలం ఉందన్నారు. మీ స్వార్థ చింతనను దేశ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అధికారం కోసం ప్రతిపక్షం అర్రులు చాస్తోందని నిప్పులు చెరిగారు. మోడీ మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీలు ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Modi appeals to MPs to defeat no confidence motion

ఎన్నికలు రాకముందే.. ప్రధాని సీట్లో కూర్చునేందుకు కొందరి యత్నం

ఇంకా ఎన్నికలు జరగలేదని, ఫలితాలు రాలేదని, కానీ జయాపజయాలకు ముందే తనను దిగిపోమని అంటున్నారని మండిపడ్డారు. తనను 125 కోట్ల మంది ప్రజలు ఇక్కడ కూర్చోబెట్టారన్నారు. ప్రధానమంత్రి సీట్లో ఎప్పుడు కూర్చుందామా అని కొందరు చూస్తున్నారన్నారు. 2019 ఎన్నికల్లో తనను రానీయమని చెబుతున్నారన్నారు.

ప్రధాని ప్రసంగానికి టీడీపీ ఎంపీలు అడ్డు

ప్రధాని మోడీ ప్రసంగాన్ని టిడిపి ఎంపీలు పదేపదే అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఎంపీలు వెల్లోకి వెళ్లాలని తోట నర్సింహం సూచించారు. టీడీపీ ఎంపీలు తమ సీట్లో కూర్చోవాలని స్పీకర్ పదేపదే సూచన చేశారు. వి వాంట్ జస్టిస్ అని టీడీపీ ఎంపీలు నినాదాలు చేశారు. బీజేపీ ఎంపీ అనురాగ్ సింగ్ ఠాకూర్‌తో టీడీపీ ఎంపీలు వాగ్వాదానికి దిగారు.

మాకు సంఖ్యాబలం ఉంది.. మోడీ

తమకు సంఖ్యాబలం ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నామని మోడీ అన్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ నినాదంతో నాలుగేళ్లుగా దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. 18వేల గ్రామాలకు కరెంట్ ఇచ్చామని చెప్పారు. ఐదు కోట్ల మందిని దారిద్ర రేఖకు ఎగువకు తీసుకు వచ్చామని చెప్పారు.

ఈ అవిశ్వాసం విపక్షాలకే కానీ తమకు కాదని మోడీ అన్నారు. 32 కోట్ల మందికి జన్ ధన్ ఖాతాలు తెరిపించామన్నారు. రైతులకు వివిధ కేంద్ర పథకాల ద్వారా ప్రయోజనాలు చేకూరుస్తున్నామని చెప్పారు. తమకు సంఖ్యాబలంతో పాటు ప్రజల ఆశీర్వాద బలం కూడా ఉందన్నారు. అవిశ్వాసం చేపడితే భూకంపం అన్నారని, కానీ భూకంపం ఏదని ప్రశ్నించారు.

ఒక్క మోడీని తొలగించేందుకు ఇంతమంది ఏకం

ప్రజాస్వామ్యంలో ప్రజలే భాగ్యవిధాతలు అన్నారు. ఒక్క మోడీని తొలగించేందుకు ఇంతమంది ఏకమవుతున్నారని ధ్వజమెత్తారు. అహంకారధోరణి వారిని అవిశ్వాసం దిశగా పురిగొల్పిందన్నారు. మేం ఓటు బ్యాంకు కోసం పని చేయడం లేదన్నారు. స్వచ్ఛ భారత్, అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ఇలా దేనిపై వారికి విశ్వాసం లేదన్నారు.

గత ప్రభుత్వాలు పేదలను నిర్లక్ష్యం చేశాయన్నారు. ప్రపంచం మొత్తం మన దేశం అభివృద్ధిని గమనిస్తోందన్నారు. కానీ విపక్షాలకు మాత్రం కనిపించడం లేదన్నారు. మా పనితీరును గుర్తించడానికి విపక్షాలకు మనసు ఒప్పడం లేదన్నారు.

ఐదు కోట్ల ఎల్ఈడీ బల్బులను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు. పదివేలకు పైగా స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయని చెప్పారు. అభివృద్ధి పథకాలపై విపక్షాలకు నమ్మకం లేదన్నారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామన్నారు. నల్లధనంపై యుద్ధాన్ని మొదలు పెట్టామని చెప్పారు. మా హయాంలో రైతులే ఎక్కువగా ప్రయోజనం పొందారని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీకి దేనిపైనా విశ్వాసం లేదన్నారు. ఎన్నికల పైన, ఈవీఎంలపై.. చివరకు కాంగ్రెస్ నేతలకు వారిపై వారికే విశ్వాసం లేదన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ విమర్శిస్తోందన్నారు. దేశానికి, ప్రపంచానికి, ఆర్థిక సంస్థలకు తమ ప్రభుత్వంపై విశ్వాసం ఉందని, కాంగ్రెస్‌కు మాత్రం లేదన్నారు.

కొంతమంది ఈ మధ్య శివభక్తులుగా మారారు

కొంతమంది ఈ మధ్య శివభక్తులుగా మారారని రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తాను కూడా శివుడినే పూజిస్తానని చెప్పారు. ప్రపంచం మన దేశ అభివృద్ధిని గమనిస్తోందన్నారు.

2024లో ఐనా నాపై అవిశ్వాసం గెలిచే శక్తి మీకు రావాలి

2024లో అయినా నా మీద అవిశ్వాసం గెలిచే శక్తి మీకు రావాలని కోరుకుంటున్నానని మోడీ అన్నారు. జాతీయ భద్రత గురించి కూడా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రఫెల్ డీల్ గురించి వాస్తవాలు వక్రీకరించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. మీ వ్యాఖ్యల వల్ల సైనికుల మనోధైర్యం ఎంత దెబ్బతిందో మీకు తెలియదన్నారు. ఆర్థికంగా దేశం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. ముద్రా యోజన కింద 13 కోట్ల మంది యువతకు రుణాలు ఇచ్చామని చెప్పారు.

కావాలంటే మీరు నన్ను తిట్టండి

మీరు తిట్టాలనుకుంటే మోడీని తిట్టాలని, ప్రాణత్యాగం కోసం సిద్ధపడే సైనికులను తిట్టవద్దని సూచించారు. సర్జికల్ స్ట్రయిక్స్ పైన కూడా వ్యంగ్యంగా మాట్లాడుతారా అని నిప్పులు చెరిగారు. దేశ రక్షణ విషయాల్లో ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు సరికాదన్నారు. రాఫెల్ ఒప్పందం పూర్తి పారదర్శకంగా జరిగిందని, అది రెండు దేశాల మధ్య జరిగిందని, ఇద్దరు వ్యక్తుల మధ్య జరగలేదన్నారు. ఎటుంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారం ఆరోపణలు సరికాదన్నారు.

వాజపేయి ప్రభుత్వాన్ని ఓడించారు

1999లో 272 మంది సభ్యులున్నారని వీర్రవీగారని మోడీ మండిపడ్డారు. ఒక్క ఓటుతో అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వాన్ని ఓడించారని నిప్పులు చెరిగారు. మద్దతిచ్చినట్లే ఇచ్చి చరణ్ సింగ్ ప్రభుత్వాన్ని కూడా కూల్చేశారన్నారు. చంద్రశేఖర్ ప్రభుత్వానికి అదే జరిగిందన్నారు. 1997లో దేవేగౌడను అవమానించారన్నారు. జననేతలుగా ఎదిగినవారిని వంచించారన్నారు. నోట్లు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం మీకు అలవాటేనని మండిపడ్డారు.

కుదిరితే సయోధ్య కోసం ప్రయత్నాలు లేదంటే ప్రభుత్వాలు కూల్చడం కాంగ్రెస్ పని అని ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చేందుకు ఓటుకు నోటు అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. కాంగ్రెస్ చాలాకాలంగా అనుసరిస్తున్న విధానం ఇదే అన్నారు.

మీరు కళ్లతో ఆడే ఆటలు దేశమంతా చూశారు

ప్రధాని నా కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేకపోతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారని, కానీ నేను ఓ పేద తల్లి కొడుకును, చిన్న కులంలో పుట్టానని అలాంటి నేను మిమ్మల్ని ఎలా చూడగలనని ప్రశ్నించారు. చరిత్రే సాక్ష్యమని, మీ కళ్లలో కళ్లు పెట్టి ఎవరూ చూడలేరన్నారు.
చంద్రబోస్, మొరార్జీ దేశాయ్ నుంచి ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్ వరకు మీ కళ్లలో కళ్లు పెట్టి చూసిన వారి పరిస్థితి తనకు తెలుసునని చెప్పారు.

మీరు కళ్లతో ఆడే ఆటలు దేశమంతా చూస్తున్నారన్నారు. (మోడీని సభలో ఆలింగనం చేసుకున్న అనంతరం రాహుల్ తన ఎంపీలు ప్రశ్నించగా, కన్నుగీటిన విషయం తెలిసిందే.) తక్షణ ముఖ్యమంత్రులను తప్పించి, రాజకీయ అస్థిరత సృష్టించడం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మీరే చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ సూత్రం ఏమంటే ఉంటే వారు అధికారంలో ఉండాలి లేదంటే అస్థిరత రాజ్యమేలాలి అన్నారు.

మీరు మునిగిపోతారు

కాంగ్రెస్ ఎలాగు మునిగిపోయిందని, దాంతో జతకట్టే వారు కూడా మునిగిపోతారని టీడీపీ వంటి పార్టీలను ఉద్దేశించి అన్నారు. తనకు ఎవరి కళ్లలో కళ్లు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. మోడీతో చూపులు కలిపిన వాళ్లకు ఏ గతి పట్టిందో తెలాల్సిందే అన్నారు. మీకు పోటీ అవుతారనుకున్న వారిని అందర్నీ వంచించారన్నారు. రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎందుకు బలహీనపడిందో చెప్పాలన్నారు. గుజరాత్‌లో కాంగ్రెస్ ఎందుకు నామరూపాలు లేకుండా పోయిందని ప్రశ్నించారు. అట్టడుగు ప్రజల వద్దకు అధికారం వెళ్లేకొద్ది కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతోందన్నారు.

పెట్రోల్ రేట్లు నిర్ణయించే అధికారం అప్పగించింది యూపీఏనే

పెట్రోల్ రేట్లు నిర్ణయించే అధికారం.. పెట్రో కంపెనీలకే అప్పగించింది గత యూపీయే ప్రభుత్వమే అన్నారు. మేం ఎవ్వరినీ వదిలేది లేదని, అందరికీ సమాధానం చెబుతామని హెచ్చరించారు. మీం మీలాగా దేశాన్ని తాకట్టు పెట్టేవాళ్లం కాదన్నారు. దళితులను, మైనార్టీలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి రాజకీయాలు చేస్తున్నది మీరే అన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టారన్నారు.

తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జీఎస్టీని అడ్డుకున్నానని కాంగ్రెస్ చెబుతోందని, కానీ నేను ఆ రోజు అన్నది ఒక్కటేనని, రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పానని తెలిపారు. మీరు అప్పుడు అహంకారంతో ఆ పని చేయలేదని, ఇప్పుడు ప్రధానిగా తాను ఆ పని చేశానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎంఎస్పీ గురించి ఇప్పుడు చెబుతోందన్నారు. 2019లో ఎన్నికలు వస్తున్నాయని 2018 నుంచే కాంగ్రెస్ బ్యాంకులను దోచుకుంటోందన్నారు. కాంగ్రెస్ హయాంలో బ్యాంకుల్లో లక్షల కోట్లు ఎంపీఏలు పెరిగాయన్నారు. ఫోన్లు చేస్తే చాలు లోన్లు ఇచ్చేశారన్నారు.

అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌తో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్యాకేజీకి అంగీకరించి ప్రశంసించిన ఆయన వైసీపీ ఉచ్చులో పడి, తన స్వార్థ ప్రయోజనాల కోసం యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ఆ రోజు తాను తల్లిని చంపి బిడ్డను కాపాడారని అన్నానని, ఇప్పుడు తెలుగు తల్లి స్ఫూర్తిని కాపాడాలని చెబుతున్నానని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి

హింసాత్మక ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాను మరోసారి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. హింసాత్మక ఘటనలు దేశానికి అవమానమన్నారు.

English summary
Prime Minister Modi started his speech by thanking the Speaker for her patience in running the House for long hours. He then asked the MPs to defeat the motion so that a democratically elected majority government, the first in 30 years, can function properly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X