హార్దిక్కు పటీదార్ల ఝలక్: బీజేపీకి సౌరాష్ట్ర షాక్, ఒక్కచోటే 12 సీట్లు కోల్పోయింది
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తారని భావించిన పటీదార్లు తాజా ఎన్నికల్లో రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేశారు. పటీదార్లు మిశ్రమంగా స్పందించారు. ఇది బీజేపీకి కలిసి వచ్చింది. పటీదార్ల ప్రాబల్యం ఉన్న మొదటి రెండు నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపొందడం గమనార్హం.
Recommended Video
పటీదార్లు మొదటి నుంచి బీజేపీకే మద్దతిస్తున్నారు. హార్దిక్ పటేల్ బీజేపీని వ్యతిరేకించి, కాంగ్రెస్కు మద్దతు తెలపడంతో పటీదార్ల కొందరు బీజేపీ, మరికొందరు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. పటేళ్ల ఉద్యమంతో యువతను ఆకర్షించిన హార్దిక్ పటేల్ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. అయితే, పటీదార్లు ప్రాబల్య నియోజకవర్గాలు ఎక్కువ కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. కాబట్టి హార్దిక్ ఆశించిన స్థాయిలో కాంగ్రెస్కు మద్దతు దొరకలేదు.
కొన్నిచోట్ల మింగుడుపడేలా లేవు
కొన్నిచోట్ల ఫలితాలు ఆయనకు మింగుడు పడేలా లేవు. ఆరు కోట్ల జనాభా ఉన్న గుజరాత్లో పటీదార్లు 12 నుంచి 14 శాతం ఉన్నారు. 182 స్థానాల్లో 60 చోట్ల వీరి ప్రభావం ఉంటుంది. ప్రధానంగా సౌరాష్ట్ర, ఆ తర్వాత మధ్య, ఉత్తర గుజరాత్లలో వీరి ప్రాబల్యం ఎక్కువ. బీజేపీ 50 మంది, కాంగ్రెస్ 41 మందిని ఆ వర్గానికి చెందిన వారిని నిలబెట్టింది.
ఆ రెండు చోట్ల బీజేపీదే గెలుపు
పట్టణ ప్రాంత ఓటర్ల నాడిని పట్టుకోవడంలో హార్దిక్ విఫలమయ్యారని అంటున్నారు. రాష్ట్రంలో పటీదార్ ఓటర్లు అథ్యధికులుగా ఉన్న సూరత్ జిల్లాలోని వరచ్చా రోడ్, కామ్రెజ్లలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ రెండు ఫలితాలను హార్దిక్ జీర్ణించుకోలేని పరిస్థితి.
బీజేపీ, కాంగ్రెస్ ఇలా
గుజరాత్లో 20 శాతానికి పైగా పటీదార్ ఓటర్లు ఉన్న 25 నియోజకవర్గాల్లో బీజేపీకి 14, కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు దక్కాయి. స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. మధ్య, ఉత్తర గుజరాత్లలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య సీట్లలో చెప్పుకోదగ్గ మార్పుల్లేవు. కచ్ - సౌరాష్ట్రలో మాత్రం బీజేపీ సీట్లు తగ్గగా, కాంగ్రెస్ బలం పెంచుకుంది. గుజరాత్ను కచ్-సౌరాష్ట్ర, మధ్య, దక్షిణ, ఉత్తర గుజరాత్లుగా పరిగణిస్తారు. 11 జిల్లాలు ఉన్న సౌరాష్ట్ర ప్రాంతంలో పటీదార్ల ప్రభావం ఎక్కువ. రాజ్కోట్, పోరుబందర్, ద్వారక, సోమనాథ్లు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రాంతంలో మొత్తం 54 నియోజకవర్గాలు ఉండగా బీజేపీకి ఏకంగా 12 సీట్లు తగ్గాయి. గత ఎన్నికలతో పోల్చితే రాష్ట్రం మొత్తం మీద బీజేపీకి మొత్తం 16 స్థానాలు తగ్గాయి. ఇందులో 12 సీట్లు పటీదార్ల ప్రాబల్య నియోజకవర్గాలే. మిగతా అన్ని ప్రాంతాల్లో కలిపి కేవలం 4 సీట్లే తగ్గాయి. మధ్య గుజరాత్లో బీజేపీ స్థానాలు 39 నుంచి 37కు, దక్షిణ గుజరాత్లో 26 నుంచి 25కు, ఉత్తర గుజరాత్లో 15 నుంచి 14కు తగ్గాయి.
గోద్రాలో బీజేపీ విజయం
గోద్రా నియోజకవర్గాన్ని బీజేపీ దక్కించుకుంది. కేవలం 258 ఓట్ల తేడాతో పార్టీ అభ్యర్థి సీకే రావుల్జీ గెలుపొందారు. రావుల్ కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి. ఈసారి బీజేపీ టిక్కెట్పై ఆయన బరిలోకి దిగారు. 2002లో చివరిసారిగా గోద్రాలో బీజేపీ గెలిచింది.
బీజేపీ, కాంగ్రెస్ల తర్వాత నోటాకే ఎక్కువ
పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ తిరస్కరించేందుకు గాను ఉపయోగించే నోటా మీటను గుజరాత్లో తాజాగా 5.5 లక్షలకుపైగా మంది ఓటర్లు వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ల తర్వాత ఎక్కువ ఓట్లు దక్కింది నోటాకే కావడం గమనార్హం. రాష్ట్రంలో 1.8 శాతం ఓటర్లు ఈ తిరస్కరణ మీటను నొక్కినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.