మీలో ఎంత ఆగ్రహం ఉందో, నాలోను అంతే ఉంది: పుల్వామా టెర్రర్ దాడిపై ప్రధాని మోడీ
పాట్నా: జమ్ము కాశ్మీర్లోని పుల్వామా తీవ్రవాద దాడి విషయంలో ప్రజల హృదయాల్లో ఎంత ఆగ్రహం ఉందో, తనలోను అంతే ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన బీహార్లో పర్యటించారు. రాష్ట్రంలో ఆయన బరౌనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాట్నా మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పుల్వామా ఘటనలో బీహార్కు చెందిన ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. వారికి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడారు.
ప్రస్తుతం ప్రజల్లో ఎంతటి ఆగ్రహం ఉందో, తన హృదయంలోనూ అంతే ఆగ్రహం ఉందని మోడీ అన్నారు. పాట్నాకు చెందిన వీర జవాను సంజయ్ కుమార్ సిన్హా, భాగల్పూర్కు చెందిన రతన్ కుమార్కు నివాళులు అర్పిస్తున్నానని చెప్పారు. దేశం కోసం వారు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు.
తమ ప్రభుత్వ పాలనలో ఎన్నో అభివృద్ధి పథకాలను కొనసాగించామని మోడీ తెలిపారు. బీహార్తో పాటు తూర్పు భారత రాష్ట్రాలకు ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా ఉర్జా గంగా గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని చెప్పారు.
ఈ పథకం ద్వారా ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను గ్యాస్ పైప్లైన్లతో కలుపుతున్నామని చెప్పారు. మైట్రోరైలు ప్రాజెక్టు పాటలీపుత్ర మీదుగా కూడా నిర్మిస్తున్నామని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు చేపట్టామన్నారు.