ఇమ్రాన్ ఖాన్కు మోడీ బౌన్సర్: ట్రంప్కు పాక్ ప్రధానికి ఇదే నమో సమాధానం
జమ్మూకశ్మీర్పై ఆర్టికల్ 370 రద్దు అయ్యాక, దేశంను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ 38 నిమిషాల పాటు ప్రసంగం చేశారు. అయితే జమ్మూ కశ్మీర్ అభివృద్ధిపై, ఇకముందు జమ్మూ కశ్మీర్ ఎలా ఉండబోతోంది అనేదానిపైనే ప్రధాని మోడీ ఎక్కువగా ఫోకస్ చేశారు. అంతేకాదు ఆర్టికల్ 370వల్ల జమ్మూ కశ్మీర్ చాలా కోల్పోయిందని చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 370 ఉగ్రవాదానికి పరుడుపోసిందని చెప్పారు. కశ్మీరీ ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతూనే జమ్మూ కశ్మీర్ను టూరిజం రాజధానిగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇదంతా పార్లమెంటులో అమిత్ షా చెప్పిన మాటలే ప్రధాని మళ్లీ వల్లెవేశారు. ప్రధాని రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు అనే వార్త ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచి మోడీ ఏం మాట్లాడుతారో అని ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే అమిత్ షా ప్రసంగాన్నే మోడీ కాస్త అటు ఇటుగా మార్చి చెప్పడంతో నిరాశకు గురయ్యారు. కానీ మోడీ ప్రసంగంలో దాగున్న నిగూఢ అర్థాన్ని కొందరు మాత్రమే అర్థం చేసుకోగలిగారు.
అమిత్ షా దెబ్బకు కోలుకోలేని పాక్
పార్లమెంటులో సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి ఆర్టికల్ 370 రద్దు చేస్తూ తీర్మానంను ప్రవేశపెట్టారు. అనంతరం జమ్మూ కశ్మీర్ విభజనపై బిల్లు తీసుకొచ్చి పాస్ చేయించారు. ఆ తర్వాత లోక్సభలో కూడా స్పష్టమైన మెజార్టీతో బిల్లు పాస్ అయ్యింది. దీంతో జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అవడంతో పాటు జమ్మూ కశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్, చైనా ఆక్రమిత అక్సియాచిన్లను కూడా వదలబోమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పడంతో వాతావరణం వేడెక్కింది. పాకిస్తాన్ షరామామూలుగానే హడావుడి చేసేసింది. ఆదేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెంటనే సంయుక్త పార్లమెంట్ సమావేశం నిర్వహించడం, ఆ వెంటనే పాక్ జాతీయ భద్రతా సమావేశం నిర్వహించడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
కర్ర విరగకుండా పామును చంపిన మోడీ
ముఖ్యమైన సమావేశాల తర్వాత పాక్ భారత్తో దౌత్య సంబంధాలు తెంచుకుంటున్నట్లు ఆదేశ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే పాక్లో భారత దౌత్యాధికారి అజయ్ బిసారియాను భారత్కు తిరిగి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ను కూడా తిరిగి పిలిపించుకుంది. ఆ తర్వాత భారత్తో వాణిజ్య సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఢిల్లీ - లాహోర్ బస్ సర్వీసును రద్దు చేసింది. ఆ పై సంఝౌతా ఎక్స్ప్రెస్ను కూడా నిలిపివేసింది. పాక్లో భారత సినిమాలపై నిషేధం విధించింది. ఇలా కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇన్ని సీరియస్ నిర్ణయాలు తీసుకున్న పాక్కు మోడీ తన ప్రసంగం ద్వారా గట్టిగా బుద్ధి చెబుతారని దేశ ప్రజలు భావించారు. కానీ కర్ర విరగకుండా పామును చంపేశారు మోడీ. అంటే తాము ఎన్ని హెచ్చరికలు చేసిన భారత్ పట్టించుకోదని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి చెప్పకనే చెప్పారు ప్రధాని మోడీ. ఎంత అరిచి గీ పెట్టినా కేవలం అభివృద్ధి మంత్రంతోనే ముందుకెళతామని స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్ కూడా ప్రధాని మోడీ ఏం చెబుతారా అని ఆసక్తిగా తిలకించింది.
పాకిస్తాన్ హెచ్చరికలను పట్టించుకోని ప్రధాని
జమ్మూ కశ్మీర్ను విభజించడం, పాక్ ఆక్రమిత కశ్మీర్ను వదలమని భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ హడావుడి చేశాడు. అయితే అది తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ సమావేశాలు నిర్వహించి హడావుడి చేసినట్లు కనిపిస్తోంది. గంటల వ్యవధిలో పాక్ ప్రభుత్వం అన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ భారత ప్రధాని మోడీ కానీ హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ పెద్దగా రియాక్ట్ కాలేదు. విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కూడా నేరుగా మీడియా ముందుకొచ్చి మాట్లాడలేదు. పైగా ఆయన ప్రధాన కార్యదర్శి నుంచి ఒక ప్రెస్ నోట్ మాత్రమే విడుదలైంది. విదేశాంగ కార్యదర్శి కూడా పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై మీడియా ముందుకొచ్చి మాట్లాడలేదు . పాక్ ప్రభుత్వంకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత భారత ప్రధాని కానీ, హోంమంత్రి కానీ , విదేశాంగ మంత్రి అవసరం లేదని పరోక్షంగా చెబుతూనే పాక్ ప్రభుత్వం స్థాయి ఏంటో గుర్తు చేసే ప్రయత్నం చేసింది.అంటే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది భారత ప్రభుత్వం. డోన్ట్ కేర్ అన్న రీతిలో పాక్ ప్రభుత్వాన్ని ఒక పుల్లతో సమానంగా చూసింది. అంతేకాదు పాక్ ప్రభుత్వం బెదిరింపులకు తాము బెదిరేదిలేదని పరోక్షంగా ప్రపంచదేశాలకు తెలిపింది. ఇంత కఠిన నిర్ణయాలు తీసుకున్నా భారత్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పాక్ ప్రభుత్వం కలవరపాటుకు గురవుతోంది. భారత్ పై అన్ని అబద్ధాలు ప్రచారం చేసిన పాక్ మీడియా గొంతు సైతం మూగబోయింది.
పాక్కు పరోక్షంగా చురకలంటించిన అజిత్ దోవల్
ఇక చివరిగా మంగళవారం నుంచి జమ్ము కశ్మీర్లో పర్యటిస్తున్న జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ఓ ట్వీట్ చేశాడు. పాకిస్తాన్ భారత్తో వాణిజ్య సంబంధాలకు స్వస్తి పలికిందని అయితే దీనివల్ల భారత్కు భారీ నష్టం వాటిల్లుతోందని ట్విటర్లో పేర్కొన్నారు. ఆ నష్టం విలువ టీమిడింయా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ ద్వారా సంపాదించేంత మొత్తం అని సెటైర్ వేశారు. అంటే పాకిస్తాన్ భారత్తో వాణిస్య సంబంధాలు తెంచుకున్నప్పటికీ పెద్దగా నష్టం లేదని చెప్పే ప్రయత్నం అజిత్ దోవల్ చేశారు. అంటే పాకిస్తాన్ను భారత్ ఏ కోశానా పట్టించుకోవడం లేదనేది స్పష్టమవుతోంది.