పైసా ఖర్చు లేదు: మోడీ, ఆసనాలు వేయలేకపోయిన మంత్రులు
మానవ జీవితంలో ఉప్పుకు ఎంత ప్రాముఖ్యత ఉందో యోగాకు కూడా అంతే ప్రాముఖ్యత ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యోగా ద్వారానే శారీరక, మానసిక వికాసం సాధ్యమవుతుందని తెలిపారు.
లక్నో: మానవ జీవితంలో ఉప్పుకు ఎంత ప్రాముఖ్యత ఉందో యోగాకు కూడా అంతే ప్రాముఖ్యత ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యోగా ద్వారానే శారీరక, మానసిక వికాసం సాధ్యమవుతుందని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలోని రమాబాయ్ అంబేద్కర్ మైదానంలో నిర్వహించిన యోగా వేడుకల్లో మోడీ పాల్గొన్నారు.
పైసా ఖర్చు లేదు
వేల సంఖ్యలో తరలివచ్చిన ఔత్సాహికులతో కలిసి మోడీ యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. యోగాతో పైసా ఖర్చు లేకుండా సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చన్నారు. యోగా సాధన రుషులు, మహర్షుల నుంచి సామాన్యుల వరకు అందరికీ ఉపయోగకరమన్నారు. యోగా వల్ల ప్రపంచమంతా భారత్తో మిళితమైందన్నారు. యోగా శిక్షకులకు అద్భుత అవకాశాలు ఏర్పడ్డాయన్నారు.
వర్షంలోనూ..
లక్నోలో ఉదయం నుంచి వర్షం కురిసినప్పటికీ మోడీ సహా ప్రముఖులు, ఔత్సాహికులు వర్షంలోనే యోగసనాలు వేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యోగా చేసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మోడీ అభినందనలు తెలిపారు.
ఆసనాలు వేయలేకపోయిన మంత్రులు: కొందరైతే కునుకు తీశారు!
ఇది ఇలా ఉండగా, మధ్యప్రదేశ్కి చెందిన ఇద్దరు మంత్రులు మాత్రం యోగాసనాలు వేయలేకపోయారు. మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి గౌరిశంకర్ బిసేన్ బుధవారం చింద్వారా ప్రాంతంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు దాదాపు రెండు వేలమంది విద్యార్థులు, ప్రజలు యోగాసనాలు వేశారు.
కార్యక్రమం ప్రారంభమైన పది నిమిషాల తర్వాత ఎక్కువ సేపు కింద కూర్చోలేక మంత్రి బిసేన్ అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నారు. అందరూ యోగా చేస్తుంటే.. ఆయన అలాగే కూర్చొని నిద్రపోయి కెమెరాకు చిక్కడం గమనార్హం. అయితే, కార్యక్రమం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనకు కాస్త ఒంట్లో నలతగా ఉందని చెప్పారు.
కాగా, ఖంద్వా జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల విద్యాశాఖ మంత్రి విజయ్ షా కూడా యోగాసనాలు వేయకుండా ఉండిపోయారు. వేదికపై ఔత్సాహికులతో పాటు ఆసనాలు వేసేందుకు కూర్చున్న ఆయన కనీసం మోకాలిని ముడవలేకపోయారు. పైగా ఫోన్ చూసుకుంటూ కనిపించారు.
దీనినిపై ఆయన వివరణ ఇస్తూ.. 'ఇటీవలే ఆసుపత్రి నుంచి నేను డిశ్చార్జి అయ్యాను. నన్ను డాక్టర్ యోగా చేయొద్దు అన్నారు. నేను కావాలని ఫోన్ చూసుకుంటా లేను. ప్రధానమంత్రి నర్రేంద్ర మోడీ యోగా కార్యక్రమాన్ని వీక్షించేందుకు నేను ఫోన్ పట్టుకున్నాను'అని తెలిపారు.