ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ బిల్లుకు కేంద్ర ఆమోదం
Recommended Video
న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లు అటు లోక్సభలో పాస్ అయినప్పటికీ ఇటు రాజ్యసభలో పాస్ అయ్యేలా చూడటంలో ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో బిల్లును ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ ఆర్డినెన్స్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఆర్డినెన్స్లో ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టంలో ఏదైతే ఉందో అవే ట్రిపుల్ తలాక్ బిల్లులో ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా బిల్లును చట్టంగా మార్చింది కేంద్రం.
మళ్లీ బిల్లును సభలో ప్రవేశపెట్టాల్సిందే..!
ఇప్పటికైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ... కేంద్రం మళ్లీ ఈ బిల్లును పార్లమెంటు ముందు ప్రవేశ పెట్టి బిల్లను పాస్ చేయించాల్సిందే. ఎందుకంటే గతేడాది జనవరి 2017లో సుప్రీం కోర్టు ఓ తీర్పు ఇచ్చింది. బిల్లు పార్లమెంటులో పాస్ కాని నేపథ్యంలో ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి బిల్లును చట్టంగా చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. అలాంటప్పుడు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడం ఎందుకని ప్రశ్నించింది. ఒక బిల్లును చట్టంగా మార్చాలంటే నేరుగా ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి కేంద్ర కేబినెట్ ఆమోదిస్తే సరిపోతుందిగా అని వ్యాఖ్యానించింది. అంతేకాదు రాజ్యాంగాన్ని కాదని ఆర్డినెన్స్ల రూపంలో బిల్లును తీసుకురావడం అంటే మోసం చేయడమేనంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్డినెన్స్ అనేది రాజ్యాంగానికి మరో దారి కాకూడదని అభిప్రాయపడింది.
ఇక ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో వాడీ వేడీ చర్చ జరిగింది. విపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు బిల్లులోని అంశాలను పరిశీలించేందుకు ఒక కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం బిల్లులో పొందుపర్చిన అంశాలపై విపక్ష సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో కేంద్రం పలు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం కూడా కోరింది. ఇందులో చాలా రాష్ట్రాలు ట్రిపుల్ తలాక్ బిల్లుకు మద్దతు తెలిపాయి.
బిల్లు ఏ అంశాలు పొందుపర్చారు..?
ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మూడు సార్లు తలాక్ అని ప్రకటించి తన భార్యకు విడాకులు ఇవ్వడం నేరంగా పరిగణిస్తామని అందుకు ఆ వ్యక్తి మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని బిల్లులో పొందుపర్చారు. అంతేకాదు భారీ జరిమానా కూడా విధించడం జరుగుతుంది. తలాక్ చెబితే ఆ సమయంలో భార్యకు జీవనాధార భత్యం చెల్లించడంతో పాటు మైనర్ పిల్లల సంరక్షణ కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. తలాక్ ఎలా చెప్పినా, ఏ పద్ధతి ద్వారా చెప్పినా నేరం అవుతుందని బిల్లులో పొందు పర్చారు. అంటే టెలిఫోన్లో చెప్పినా, మొబైల్ ఫోన్ ద్వారా చెప్పినా, రాతపూర్వకంగా తెలిపినా, లేదా వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా తెలిపినా నేరం కిందకే వస్తుందని బిల్లులో పొందుపర్చారు.
సుప్రీం కోర్టు ఆర్డర్తో సమాలోచనలు జరిపిన మోడీ సర్కార్
గతేడాది ఆగష్టులో ట్రిపుల్ తలాక్ చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని అది చెల్లదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. దీంతో మోడీ సర్కార్ కొంతమంది ముఖ్యమైన మంత్రులతో కూర్చుని ఎలా ముందుకెళ్లాలి అనేదానిపై ఆలోచన చేసింది. ఈ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్లు పాల్గొన్నారు.
ముస్లిం మహిళలకు తమ భర్తలు ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడంతో తాము అనాథలమైపోతున్నామని దీనిపై తమకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతేకాదు ట్రిపుల్ తలాక్ చెప్పి తమ హక్కులను కాలరాస్తున్నారని ఆమె పిటిషన్లో పేర్కొంది. దీన్ని విచారణ చేసిన సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ పద్ధతి చట్టవిరుద్ధమని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలా మొత్తం సుప్రీం కోర్టులో 177 కేసులు నమోదయ్యాయి. అందులో సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చాక 70 కేసులు వచ్చాయి.