కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు...
బుధవారం సమావేశం అయిన కేంద్ర కేబినేట్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ మరియు ఎంటీఎన్ఎల్లను గట్టేక్కించేందుకు వాటిని విలీనం చేయాలని నిర్ణయం తీసుకోవడంతోపాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే సుమారు 1800 కాలనీల్లో ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు రైతులను ఆదుకునేందుకు గోధుమ సహ మరిన్ని పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బీఎస్ఎన్ఎల్ను గట్టెక్కించేలా సెంట్రల్ కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ రంగ టెలికామ్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ కారణంగా బీఎస్ఎన్ఎల్ కొన్నాళ్లుగా కష్టాలు పడుతున్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనానికి కేంద్రకేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతోపాటు ఉద్యోగుల వీఆర్ఎస్కు సంబంధించి కూడా కేంద్ర మంత్రివర్గం ఆకర్షణీయమైన స్వచ్ఛంద విరమణ ప్యాకేజీ ప్రకటించింది. దీంతోపాటు 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.. అయితే ఈ కేటాయింపులు 2016 ధరలకు అనుగుణంగా ఉంటాయని కేంద్ర టెలికామ్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు.
దేశరాజధాని ఢిల్లీలో అక్రమంగా కాలనీలు, ఇళ్లను నిర్మించుకున్న సుమారు 1800 కాలనీల్లో నివసిస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రప్రభుత్వ నిర్ణయంతో ఢిల్లీలో నివసిస్తున్న సుమారు నలబై లక్షల మంది నివాసితులకు ప్రయోజనం చేకూరనుంది. దీంతోపాటు రైతులను ఆదుకునేందుకు గోధుమ సహ మరిన్ని పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మద్దతు ధర ప్రకటించిన వాటిలో గోధుమకు రూ.1840 నుండి 1925కు పెంచారు. కాగా బార్లీ గత సంవత్సరం కంటే అదనంగా 85 రుపాయాలను, పప్పుధాన్యాలకు రూ. 255, సన్ఫ్లవర్ గింజలకు రూ 270 తోపాటు ఇతర తృణ ధాన్యాలకు కనీస మద్దతు ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు.