బుధవారం మోదీ కేబినెట్ కీలక భేటీ..!ప్రస్థావనకు వచ్చే అంశాలపై ఉత్కంఠ..!!
ఢిల్లీ/హైదరాబాద్ : సుధీర్ఘ కాలం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నారు. మోదీ ఆధ్వర్యంలో జరగబోయే భేటీ పై ఆసక్తి నెలకొంది. లాక్డౌన్ ఆంక్షలు, ఇరవై లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ పట్ల ప్రజా స్పందన, కరోనా కేసుల నమోదు తదితర అంశాలను ప్రస్థావించే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. మే 20వ తేదీ బుధవారం ఉదయం పదకొండు గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ అంశం అందరి దృష్టిని ఆకర్శింస్తోంది. ప్రధానంగా లాక్డౌన్ ఆంక్షలు, పెరుగుతున్న కరోనా కేసుల పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఏదైనా ఆఫీసులో ఒక్కరిద్దరికి కరోనా సోకితే ఏం చేయాలంటే..: కేంద్రం కొత్త మార్గదర్శకాలు
బుదవారం మంత్రివర్గ భేటీ.. మోదీ చర్చించే అంశాలపై ప్రజల ఫోకస్..
ఇదిలా ఉండగా కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశంలో కొనసాగుతున్న లాక్డౌన్ పరిస్థితులను, కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం వంటి అంశాలను చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గత వారం ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన ఆర్థిక ప్యాకేజీపై వస్తున్న చర్చ ఏవిధంగా ఉందనే అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. రెండు నెలలుగా దేశాన్ని కరోనా వైరస్ కుదిపేస్తోందని, వైరస్ నియంత్రణ అదుపులో ఉండకపోగా, పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష అంకెను దాటడం ఆందోళనకంరంగా మారింది. ఇదే అంశం మోదీ మంత్రివర్గ భేటీలో చర్చకు రానున్నట్టు తెలుస్తోంది.
కరోనా కట్టడి, ఆర్ధిక ప్యాకేజీపై ఫీడ్ బ్యాక్.. మంత్రుల ద్వారా ప్రజా స్పందన తెలుసుకోనున్న మోదీ..
ఇదిలా ఉండగా మరో రెండు, మూడు నెలల దాకా కరోనా ఉధృతి కొనసాగనున్నట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా దేశం ఆర్థికంగా చితికిపోయింది. దివాళా తీసిన ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పలు ఉద్దీపనలను ప్రకటించింది. రంగాల వారీగా ప్యాకేజీలను వెల్లడించింది. అయితే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన ప్యాకేజీలతో లాభం లేదన్న అభిప్రాయాన్ని విపక్షాలతో పాటు కొన్ని తటస్థ రాజకీయ పార్టీలు సైతం తప్పుపడుతున్నాయి.
కేంద్ర ప్యాకేజీని వ్యతిరేకించిన కేసీఆర్.. అదే బాటలో మరికొంత మంది సీఎంలు..
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కేంద్ర ప్రకటించిన ప్యాకేజీని పచ్చిమోసంగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్థిక ప్యాకేజీపై పెదవి విరవగా, పలు విదేశీ మీడియా సంస్థలు తమ విశ్లేషణల్లో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని నిరర్ధక ప్యాకేజీగా పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక ప్యాకేజీపై వచ్చిన ప్రతిస్పంధనల గురించి కేబినెట్ సమావేశం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా వైరస్ నియంత్రణా చర్యలను, వలస కార్మికుల తరలింపు కారణంగా ఉత్పన్నమైన పరిణామాలను కేబినెట్ చర్చించే అవకాశాలు ఉన్నాయి.
వలస కూలీల అంశంలో విమర్శలు.. లోతుగా చర్చించనున్న మోదీ మంత్రివర్గం..
అంతే కాకుండా వలస కార్మికుల సహాయ కర్యక్రమాలు, 20లక్షల కోట్ల ప్యాకేజీలో మార్పులు, చేర్పుల గురించి నిపుణుల అభిప్రాయాన్న తీసుకోవాలని కేంద్ర సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రోడ్డు రవాణాకు దాదాపుగా ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్, రైలు, విమానయానంపై మాత్రం మే 31వ తారీఖు వరకు నిషేధాన్ని కొనసాగిస్తోంది. అయితే, డొమెస్టిక్ విమానాలను నడపాలన్న డిమాండ్ బలపడుతున్న తరుణంలో రేపటి కేంద్ర కేబినెట్ భేటీలో ఇదే అంశంపై కీలక ఓ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. రైళ్ళ విషయంలోను కొనసాగుతున్న కొన్ని పరిమితులను మరింత సరళతరం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపే పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇవే అంశాలపై దేశ ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నట్టు తెలుస్తోంది.