మోడీ కేబినెట్: ఎవరేం చదివారు? అనుపమ పిన్నవయస్కురాలు
న్యూఢిల్లీ: తాజాగా కేంద్ర కేబినెట్లో స్థానం దక్కించుకున్న 19 మంత్రుల్లో 17 మంది కనీసం డిగ్రీ పూర్తి చేసినవాళ్లే ఉన్నారు. ఇద్దరు మాత్రమే డిగ్రీ కన్నా తక్కువ చదివారు. వీరిలో ఆరుగురు లాయర్లు, ఓ డాక్టర్, ఓ పీహెచ్డీ డిగ్రీ పట్టాదారు ఉన్నారు.
వీరు కాకుండా నలుగురు మంత్రులు పీజీ చదవగా, ఐదుగురు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. లాయర్ మంత్రుల్లో ఒకరైన పీపీ చౌదరి సుప్రీం కోర్టులోనూ ప్రాక్టీస్ చేశారు. విజయ్ గోయల్, ఫగన్ సింగ్ కులాస్తే, అర్జున్ రామ్ మేఘ్వాల్, అహ్లూవాలియా, రాజన్ గోహేన్ కూడా లాయర్లే.
సుభాష్ రామ్ రావ్ భ్రామ్రే ఓ డాక్టర్. ఈయన క్యాన్సర్ సర్జరీ నిపుణులు. మహేంద్ర నాథ్ పాండే హిందీలో పీహెచ్డీ చేసి డాక్టరేట్ పొందారు. ఇక క్రిష్టారాజ్, అనుప్రియా పటేల్, సీఆర్ చౌదరి, అనిల్ మాధవ్ దవే పీజీలు చేశారు.
ఎంజె అక్బర్, రమేష్ జిగజినాగి, జశ్వంత్ సిన్హ్ భాబోర్, పురుషోత్తమ్ రూపాల, ముఖేశ్ మాండవీయ డిగ్రీ పూర్తి చేశారు. అజయ్, రామ్దాస్ అథవాలే మాత్రం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. కొత్త మంత్రుల సగటు వయసు 57 కాగా, 35 ఏళ్ల అనుప్రియా పాటిల్ అత్యంత పిన్న వయస్కురాలు.
జర్మనీలో ఉండగా ప్రధాని ఫోన్ చేశారు: జవదేకర్
తనకు కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ ఇస్తున్న విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి చెప్పారని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. తాను జర్మనీలో జరుగుతున్న పర్యావరణ సదస్సులో ఉండగా, మోడీ నుంచి ఫోన్ వచ్చిందని, విషయం చెప్పిన మోడీ, ఉన్నపళంగా బయలుదేరి ఢిల్లీకి రావాలని చెప్పారన్నారు.