అవినీతిపరులకు టైమ్ ఇవ్వాలా?: తేల్చి చెప్పిన మోడీ
న్యూఢిల్లీ: నల్లధనంపై ప్రతీ సామాన్యుడూ సైనికుడిలా పోరాడాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అవినీతి, నల్లధనంపై ఉమ్మడి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. పార్లమెంట్ భవన్లో శుక్రవారం జరిగిన 'న్యూ వెర్షన్ ఆఫ్ కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా' పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని 'మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్' పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. యువతలో రాజ్యాంగం పట్ల అవగాహన పెంచేందుకు ప్రత్యేక దినోత్సవం అవసరమని అభిప్రాయపడ్డారు.
మన జీవితాల్లో రాజ్యాంగానికి ప్రత్యేక స్థానముందని.. రాజ్యాంగాన్ని గుర్తుచేసుకుంటే అంబేడ్కర్ను స్మరించుకున్నట్లేనని చెప్పారు. ఆన్లైన్ సేవలని విస్తృతంగా వినియోగించుకోవాలని చెప్పారు.
వ్యాపార లావాదేవీలన్నీ మొబైల్ ఫోన్తోనే చక్కబెట్టుకోవచ్చని చెప్పారు. డిజిటల్ కరెన్సీని విరివిగా వాడుకోవాలన్నారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు పయనిద్దామన్నారు. పెద్ద నోట్ల రద్దును సమర్థిస్తూ.. తమ ప్రభుత్వం అవినీతిపరులకు సమయం ఇవ్వదని తేల్చి చెప్పారు.