మోదీ-దీదీ సమావేశం: ప్రధానితో సమావేశం తర్వాత నిరసన కార్యక్రమానికి హాజరైన మమతా
పశ్చిమ బెంగాల్ : ప్రధాని నరేంద్రమోడీ రెండురోజుల పర్యటన కోసం బెంగాల్ చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు. ఎన్ఆర్సీ పౌరసత్వ సవరణ చట్టంపై సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్న ప్రాంతాల్లో ఇప్పటికే నిరసనకారులు ఫ్లకార్డ్లను ప్రదర్శిస్తూ నిరసనలు తెలిపారు. కోల్కతాలోని పలు ప్రాంతాల్లో నిరసనలు హోరెత్తాయి. యువత, రాజకీయ పార్టీలు ఇతర సంఘాలు గోబ్యాక్ మోడీ అంటూ నల్ల జెండాలతో నిరసన తెలిపాయి.
ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం ముగిసిన తర్వాత సీఎం మమతా బెనర్జీ మాట్లాడారు. బెంగాల్ రాష్ట్రం పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకమని మోడీ దృష్టికి తీసుకొచ్చినట్లు మమతా చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు బెంగాల్ రాష్ట్రం వ్యతిరేకమని మోడీకి వివరించినట్లు చెప్పిన దీదీ... రాష్ట్రంలో నివాసముంటున్నవారు ఎవరూ దేశం వదిలి వెళ్లేందుకు వీలులేదని చెప్పినట్లు వెల్లడించారు.
#WATCH: PM Narendra Modi meets West Bengal CM Mamata Banerjee in Kolkata. The Prime Minister is in Kolkata to take part in 150th anniversary celebrations of the Kolkata Port Trust. pic.twitter.com/6r6ghcLlSu
— ANI (@ANI) January 11, 2020
ఎవరిపైనా అట్రాసిటీ కేసులు పెట్టరాదని అదే సమయంలో ఎన్ఆర్సీ, సీఏఏలను పునఃసమీక్షించాలని మోడీని కోరినట్లు మమతా బెనర్జీ చెప్పారు. అయితే తాను బెంగాల్కు వచ్చిన పని వేరని వీటిపై ఢిల్లీలో చర్చిద్దామని ప్రధాని మోడీ చెప్పినట్లు మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ప్రధాని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వచ్చినందున సీఎంగా ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశానని ఆమె చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీతో మమతా భేటీ ముగిసిన తర్వాత సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ తృణమూల్ ఛత్ర పరిషత్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీతో మమతా భేటీ కావడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత డెరెక్ ఓ బ్రెయిన్ వివరణ ఇచ్చారు. ప్రధాని మోడీతో మమత బెనర్జీ సమావేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన సమావేశంగా మాత్రమే చూడాలని ఇందులో ఎలాంటి రాజకీయంకు తావు లేదని స్పష్టం చేశారు. తృణమూల్ కాంగ్రెస్కు ఎవరూ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పనిలేదని చెప్పారు. ఎన్ఆర్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి మరువరాదని డెరెక్ చెప్పారు. ఇప్పుడు ఈ ఉద్యమమే ప్రజాఉద్యమంగా మారిందని చెప్పారు. ఎన్ని ర్యాలీల్లో పాల్గొన్నారు.. ఎన్ని నిరసన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు అని విమర్శకులను సూటిగా ప్రశ్నించిన డెరెక్ సోఫాపై కూర్చుని ఉచిత సలహాలు ఇవ్వడం మానేయాలని చురకలంటించారు.
అంతకుముందు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. రెండు రోజుల పాటు వెస్ట్బెంగాల్లో ఉండనున్నట్లు చెప్పారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రామకృష్ణ మిషన్లో సమయం గడపడం కోసం వేచిచూస్తున్నట్లు చెప్పారు. అయితే ఆత్మస్తానంద మహరాజ్ను ఈ సమయంలో గుర్తుచేసుకున్నారు ప్రధాని మోడీ. తాను లేకపోవడం తీరని లోటని చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని ఆయనే తనకు బోధించారని గుర్తుచేశారు ప్రధాని మోడీ. ఆత్మస్తానంద మహారాజ్ లేని రామకృష్ణ మిషన్ను తాను ఊహించలేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఆదివారం ఉదయం స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాల్లో పాల్గొని అనంతరం కోల్కతా పోర్టు 150వ వార్షికోత్సవంలో పాల్గొంటారు. అనంతరం మోడీ ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.