యూనివర్శిటీలను చెప్పుచేతల్లో తెచ్చుకోవడానికే: మోడీ సర్కార్ పై ఒవైసీ భగ్గు
హైదరాబాద్: దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యూ)లో చోటు చేసుకున్న తాజా పరిణామాల వెనుక భారతీయ జనతా పార్టీ ప్రమేయం ఉందని అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమిన్, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. బీజేపీ ప్రోత్సాహంతోనే గూండాలు రెచ్చిపోయి విద్యార్థులపై ప్రాణాంతక దాడులకు పాల్పడ్డారని విమర్శించారు.
JNU Violence: ఢిల్లీ పోలీసులపై ముప్పేట దాడి: వారి తీరుకు సిగ్గుపడుతున్నా: సీనియర్ అడ్వొకేట్
జెఎన్యూ విద్యార్థులపై దాడి ఘటనను ఆయన అత్యంత క్రూరమైన చర్యగా అభివర్ణించారు. బీజేపీ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతారని బహుశా ఎవరూ ఊహించి ఉండబోరని చెప్పారు. విశ్వవిద్యాలయాలను కాషాయమయం చేయడంలో భాగంగా.. బీజేపీ ప్రభుత్వం ఈ దారుణానికి పాల్పడిందని ఆరోపించారు. విద్యార్థులు తమకు లొంగట్లేదనే అక్కసుతో దాడులు చేశారని, అయినప్పటికీ.. వారిలో ఆత్మస్థైర్యం చెక్కుచెదరలేని అన్నారు.
జెఎన్యూ విద్యార్థులకు తాను సంఘీభావాన్ని ప్రకటిస్తున్నానని, త్వరలో వారిని పరామర్శిస్తానని చెప్పారు. ఇదివరకు విశ్వవిద్యాలయాల్లో అరాచకాన్ని సృష్టించడానికి, వాటిని తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకోవడానికే బీజేపీ నాయకులు ఇలాంటి అమానవీయ చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులపై దాడులు చేయడం అనాగరిక చర్య అని అన్నారు. యథేచ్ఛగా దాడులు కొనసాగుతున్నప్పటికీ ఢిల్లీ పోలీసులు ఎందుకు వారిని రక్షించలేకపోయారని ప్రశ్నించారు.
A Owaisi: I condemn this violence. There is no doubt these ppl were given the green signal by the powers that be. They had covered their faces in a cowardly way and were allowed to enter JNU with rods&sticks.Worst is there is a video which shows Police allowed them safe passage pic.twitter.com/P70lSm7xjh
— ANI (@ANI) January 6, 2020
కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూరకంగానే ఈ దాడులకు పాల్పడిందనడానికి ఇంతకంటే సాక్ష్యాధారాలు ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. అయిదు గంటల పాటు గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి, ఓ ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో యథేచ్ఛగా విద్యార్థులను చితకబాదుతుంటే పోలీసులు ఎందుకు సంఘటనా స్థలానికి చేరుకోలేదని అన్నారు. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కూడా పోలీసులు సకాలంలో ఫిర్యాదు చేయలేకపోయారని, అవన్నీ చూస్తోంటే.. ఈ దాడి వ్యవహారం అంతా బీజేపీ పెద్దల కనుసన్నల్లో చోటు చేసుకున్నట్టుగా కనిపిస్తోందని, దీనికి బాధ్యత వహించాల్సింది మోడీ ప్రభుత్వమేనని అన్నారు.