పది శాతం సీట్లు రాలేదు.. మరి ప్రతిపక్ష హోదా దక్కేనా?
ఢిల్లీ : భారీ మెజార్టీతో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న బీజేపీ మరో ఘనత సొంతం చేసుకోనుంది. వరుసగా రెండోసారి లోక్సభలో ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసిన రికార్డు సాధించనుంది. 2014లోనూ ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కకపోగా.. ఈసారి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. గతంతో పోలిస్తే కాంగ్రెస్ సంఖ్యా బలం పెరిగినా.. లీడర్ ఆఫ్ అపొజిషన్ హోదా పొందేందుకు అర్హత సాధించలేకపోయింది.
పార్లమెంట్ లో ఖార్గే అడుగు పెట్టలేరు: ప్రధాని మోడీ చెప్పారు, బీజేపీ చేసి చూపించింది, కాంగ్రెస్ !
10శాతం సీట్లుంటేనే ప్రతిపక్ష హోదా
లోక్సభలో ఏ పార్టీ అయినా ప్రతిపక్ష హోదా సాధించాలంటే 10శాతం సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. లోక్సభలో ప్రస్తుతం 543 మంది సభ్యులున్నందున ఆ హోదా పొందేందుకు పార్టీ కనీసం 55 సీట్లు సంపాదించుకోవాలి. అయితే 2014లో కేవలం 44 సీట్లలో మాత్రమే విజయం సాధించిన కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా సాధించడంలో విఫలమైంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ కౌంట్ పెంచుకున్నా 52 స్థానాల్లో విజయం సొంతం చేసుకుంది.
నియామకాల్లో కీలక పాత్ర
లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిది అత్యంత కీలకమైన పాత్ర. రాజ్యాంగబద్ధ సంస్థల నియామకాల్లో లీడర్ ఆఫ్ అపొజిషన్ ముఖ్యపాత్ర పోషిస్తారు. లోక్పాల్, సీబీఐ డైరెక్టర్, చీఫ్ విజిలెన్స్ కమిషనర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఛైర్పర్సన్ నియామకాలకు ప్రతిపక్ష నేత అభిప్రాయాన్ని తప్పక పరిగణలోకి తీసుకుంటారు. అయితే 2014లో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతో లోక్పాల్ నియామక సమావేశానికి హాజరయ్యేందుకు మల్లిఖార్జున ఖర్గే నిరాకరించారు. లోక్పాల్ నియామకానికి సంబంధించిన కమిటీ మీటింగ్కు ప్రతిపక్ష నేతగా కాక ప్రత్యేక అతిధిగా ఆహ్వానించడంపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భేటీకి హాజరుకాకపోవడంతో లోక్పాల్ నియామకం నిలిచిపోయింది.
చట్ట సవరణకు కాంగ్రెస్ డిమాండ్
లోక్సభలో ప్రతిపక్ష హోదా దక్కకపోవడంపై కాంగ్రెస్ గతంలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అపొజిషన్ పార్టీకి 10శాతం సంఖ్యాబలం ఉండాలన్న నిబంధనను మార్చాలని పట్టుబట్టింది. దీనికి సంబంధించి చట్టంలో సవరణ చేయాలని, సభలో రెండో అతిపెద్ద పార్టీని అపొజిషన్ పార్టీగా గుర్తించాలని అప్పట్లో డిమాండ్ చేసింది. తాజా ఎన్నికల్లోనూ ఆ పార్టీ 55సీట్లు గెల్చుకోకపోవడంతో మళ్లీ ఈ వాదనను తెరపైకి తెచ్చే అవకాశముంది.
1969 వరకు ప్రతిపక్షం ఊసే లేదు
మొదటి లోక్సభ స్పీకర్ జీవీ మావలంకర్ ప్రతిపక్ష హోదా సాధించేందుకు 10శాతం సీట్లు ఉండాలన్న నిబంధన తీసుకొచ్చారు. అయితే దేశంలో తొలి మూడు సార్వత్రిక ఎన్నికల వరకు అసలు ప్రతిపక్ష హోదా ప్రశ్నే తలెత్తలేదు. 1951-52, 1957, 1962లో నెహ్రూ నేతృత్వంలో కాంగ్రెస్ అఖండ మెజార్టీ సాధించడంతో ప్రత్యర్థి పార్టీలు 10శాతం సీట్లు గెల్చుకోలేకపోయాయి. 1969లో తొలిసారి ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కగా.. 1977లో కేంద్రం లీడర్ ఆఫ్ అపొజిషన్ యాక్ట్ తెచ్చింది. ఆ చట్ట ప్రకారం ప్రతిపక్ష నాయకుడికి జీతం, ఇతర అలవెన్సులు చెల్లిస్తున్నారు.