సరైన నిర్ణయమేనా?: డిఫెన్స్, ఏవియేషన్ రంగాల్లో 100 శాతం ఎఫ్డీఐలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎంతో కీలకమైన రక్షణ రంగంతో పాటు సివిల్ ఏవియేషన్ రంగాల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ)కు ఆమోదం తెలుపుతున్నట్లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ మూడు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి 49 శాతంగా ఉండేది.
తాజా ప్రకటనలో దీనిని ఒకేసారి 100 శాతానికి.. అంటే 51 శాతం పెంచడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఎఫ్డీఐ పాలసీలో కేంద్రం మార్పులు చేసిన దాని ప్రకారం ఇకపై డిఫెన్స్, విమానయాన రంగంలో 100 శాతం ఎఫ్డీఐలతో పాటు ఫార్మా రంగంలో 74 శాతం ఎఫీడీఐలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది.
కేంద్రం నిర్ణయంతో విదేశీ ఆయుధ కంపెనీలు భారత్కు క్యూ కట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయా కంపెనీలు చిన్న తరహా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని తయారు చేసుకునే ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ నిర్ణయంతో ఏవియేషన్, ఫార్మా రంగాల్లో భారీగా మార్పులు సంభవించనున్నాయి.
రక్షణ రంగంలో ఎఫ్డీఐల పెంపు కోసం ప్రభుత్వం ఆయుధ చట్టం 1959లో కూడా సవరణలు చేసింది. దీంతో పాటు మనదేశంలో ఆపిల్ మొబైల్ కంపెనీ మొబైల్ స్టోర్లను ఓపెన్ చేసేందుకు కూడా అనుమతిచ్చింది. నిజానికి యూపీఏ హయాంలో ఎఫ్డీఐలను మన దేశంలో ఆహ్వానించింది.
అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ, కీలకమైన రక్షణ రంగంలో 100 శాతం ఎఫ్డీఐల అనుమతి మంచి కాదని ఆందోలన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలకే మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రక్షణ, ఫార్మా తదితర రంగాల్లో 100 శాతం ఎఫ్ డీఐలకు అనుమతులు మంజూరు చేయడం గమనార్హం.