కాశ్మీర్ ముఖచిత్రంలో సమూల మార్పు: రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా
న్యూఢిల్లీ: కేంద్రంలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో జమ్మూ కాశ్మీర్ ముఖ చిత్రం సమూలంగా మారిపోనుంది. జమ్మూ కాశ్మీర్ విడిపోనుంది. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఆవిర్భవించబోతోంది..
కాశ్మీర్ లొల్లి : రాజ్యంగ ప్రతులను చింపబోయి.. బట్టలను చింపుకొని!
జమ్మూ కాశ్మీర్ ఓ కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు కానుండగా.. మారుమూల కొండ ప్రాంతం లడక్ మరో కేంద్ర పాలిత ప్రాంతంగా మారుతుంది. జమ్మూ కాశ్మీర్ ను రాష్ట్రంగా గుర్తిస్తూ, దానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం ఉదయం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
జమ్మూ కాశ్మీర్..ప్రజా ప్రతినిధులతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం!
రాజ్యసభలో ఎన్డీఏకు మెజారిటీ సభ్యులు ఉన్నందున.. బిల్లు ఆమోదం పొందడం సులభమే అయినప్పటికీ.. వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. దీనికి- ప్రతిపక్షానికి చెందిన బహుజన్ సమాజ్ వాది పార్టీ, తటస్థంగా ఉంటూ వచ్చిన బిజూ జనతాదళ్ మద్దతు పలికాయి. ఈ బిల్లు చట్ట రూపం దాల్చిన అనంతరం జమ్మూ కాశ్మీర్ ముఖచిత్రం సమూలంగా మారిపోతుంది. ఇన్నాళ్లూ మనకు ఒకే రాష్ట్రంగా, భారత దేశానికి తలమానికంగా ఉంటూ వచ్చిన జమ్మూ కాశ్మీర్ ఇక రెండుగా కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా.. లడక్ మరో కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రస్ఫూటిస్తాయి. ప్రజా ప్రతినిధులతో కూడిన జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించింది. అంటే- పుదుచ్చేరి తరహాలో. జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కొనసాగుతుంది. ఇక అయిదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు.
ప్రజా ప్రతినిధులు లేని కేంద్ర పాలిత ప్రాంతంగా లడక్
లడక్.. ఇక పూర్తిగా కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోతుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉండరు. ప్రభుత్వం ఉండదు. డయ్యూ, డామన్ తరహాలో అక్కడ పాలన ఏర్పడుతుంది. మిగిలిన కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చుకుంటే.. లడక్ భౌగోళికంగా అత్యంత సంక్లిష్టమైనది. అత్యంత సున్నిత ప్రాంతం. చైనాతో సరిహద్దులను పంచుకుంటోన్న కారణంగా ఇక్కడ లెప్టినెంట్ గవర్నర్ ను నియమించే అవకాశం ఉంది. లెప్టినెంట్ గవర్నర్ చేతుల్లో లడక్ ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటవుతుంది. జమ్మూ కాశ్మీర్ విభజనకు సంబంధించిన అపాయింట్ డే ఎప్పుడనేది ఇంకా నిర్దారించాల్సి ఉంది.