మమత ఇష్యూ: అమిత్ షాకు మోడీ సర్కారు ఝలక్!
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా వ్యాఖ్యలతో విభేదించాయి! బుర్ద్వాన్ పేలుళ్లపై షా చేసిన వ్యాఖ్యలపై కేంద్రం విభేదించింది. ఇటీవల అమిత్ షా, కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఇరుకున పడేశాయి. దీంతో మోడీ నేతృత్వంలోని కేంద్రం వీటిని సమర్థించడం లేదు.
ఇప్పిటేక సాధ్వీ వ్యాఖ్యల పైన మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె క్షమాపణ కూడా చెప్పారు. ఎవరు హద్దులు దాటవద్దని మోడీ హెచ్చరించారు. ఇదిలా ఉండగా, అమిత్ షా ఇటీవల పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పైన నిప్పులు చెరిగారు. అదే సమయంలో తీవ్ర ఆరోపణలు చేశారు. శారదా స్కాం మనీ బుర్ద్వాన్ పేలుళ్లకు ఉపయోగించి ఉంటారని ఆరోపించారు.
దీనిని మోడీ ప్రభుత్వం వ్యతిరేకించింది. లోకసభలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ బుధవారం దీని పైన లిఖిత పూర్వక స్టేట్మెంట్ ఇచ్చారు. శారదా స్కాం డబ్బు పేలుళ్లకు ఉపయోగపడినట్లుగా ఇప్పటి వరకు విచారణలో తేలలేదని స్పష్టం చేశారు. శారదా స్కాం డబ్బులు బంగ్లాదేశ్కు వెళ్లినట్లుగా, టెర్రర్ యాక్టివిటీస్కు ఫండ్ చేసినట్లుగా తేలలేదని అందులో పేర్కొన్నారు. స్కాంకు సంబంధించిన వివరాలు తాము కోరలేదన్నారు.
అదే సమయంలో ఈ కుంభకోణంలో ఎవరికి కూడా క్లీన్ చిట్ ఇవ్వలేదని చెప్పారు. ఈ కుంభకోణం పైన విచారణ జరుగుతోందని చెప్పారు. కేంద్రం ప్రకటన నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అమిత్ షా క్షమాపణలకు డిమాండ్ చేశారు. అమిత్ షా బోగస్ పర్సన్ అని, ఆయన గుజరాత్లో ఫేమస్ క్రిమినల్ అని, అతను అబద్దాలకోరు అని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఆరోపించారు.
అమిత్ షా ఎలాంటి సమాచారం లేకుండా ఆరోపణలు చేశారని, అతను మాట్లాడేటప్పుడు అన్ని తెలుసుకొని మాట్లాడాలని, తన ఆరోపణలకు అతను క్షమాపణలు చెప్పాలని మరో ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అన్నారు.
మరోవైపు, దీని పైన బీజేపీ అధికార ప్రతినిధి సిద్ధార్థ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. అమిత్ షా పత్రికల్లో చూసిన వాటిని చెప్పారని తెలిపారు. మరోవైపు, సీపీఎం నేత సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. చూస్తుంటే బీజేపీ, టీఎంసీల మధ్య ఏదో డీల్ జరుగుతున్నట్లుగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.