మోడీ తీసుకొచ్చిన విధానాలు ప్రజలకు ఏమాత్రం మేలుచేయలేదు: ప్రియాంకా గాంధీ
ఢిల్లీ: కాంగ్రెస్ ఉత్తర్ ప్రదేశ్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ మరోసారి ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. దేశ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మోడీకి అవగాహన లేదని అన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల ఇబ్బందులను సమస్యలను పరిష్కరించడంలో మోడీ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. విదేశీ పర్యటనలకు వెచ్చించిన సమయం దేశ ప్రజల సమస్యలపై వెచ్చించి ఉంటే సగం సమస్యలకైనా పరిష్కారం లభించేదని వ్యాఖ్యానించారు.
తమది జాతీయ భావం ఉన్న ప్రభుత్వం అని మోడీ పదే పదే చెబుతుంటారని... అయితే ప్రజల గొంతును నొక్కేయడం, ప్రజల సమస్యలను వినకపోవడం వంటివి చేస్తున్న ప్రభుత్వాలకు జాతీయభావం ఎక్కడుంటుందని ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. ఇక నిరుద్యోగం, రైతు సమస్యలపైనే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రియాంకా గాంధీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే న్యాయ్ పథకాన్ని అమలు చేస్తామంటున్నారు కానీ అది ప్రజల్లోకి చేరలేదని బీజేపీ విమర్శిస్తోందని ప్రియాంకాను అడుగగా ఆమె చాలా తెలివిగా సమాధానం చెప్పారు. ప్రభుత్వం చెబుతున్నది నిజమే అని న్యాయ్ (న్యాయం) ప్రజలకు జరగలేదని వారే ఒప్పుకుంటున్నారని సెటైర్ వేశారు.
అధికారంలోకి వస్తే ఏదో చేస్తారని దేశ ప్రజలు భావించి మోడీని ప్రధానిని చేశారని అయితే వారి నమ్మకానికి తూట్లు పొడిచారని విమర్శించారు ప్రియాంకా గాందీ. ప్రజలకు ఉపయోగపడని విధానాలు తీసుకొచ్చి వ్యవస్థలను దుర్వినియోగం చేశారని ప్రియాంకా గాంధీ నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు రైతు సమస్యలను విస్మరించి ఎన్నికలకు రెండు నెలల ముందు రైతులకు రూ.6వేలు ప్రకటిస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు.