ఇక ‘ఎర్ర బుగ్గ’లు కనిపించవు: రాష్ట్రపతి, ప్రధాని, సీఎంల వాహనాలకూ తొలగింపు
న్యూఢిల్లీ: : ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వీఐపీ కార్లపై ఎర్ర బుగ్గల సంస్కృతికి స్వస్తి పలికింది. దేశంలో రాష్ట్రపతి, ప్రధాని సహా ఏ స్థాయి వ్యక్తి వాహనంపైనా వచ్చే మే 1 నుంచి ఎర్రబుగ్గగాని, నీలిబుగ్గగాని కనిపించదు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, కేబినెట్ హోదాలో ఉన్న వ్యక్తులు, అత్యున్నతాధికారుల వాహనాలపై ఈ లైట్లు మాయం కానున్నాయి.
వీరి వాహనాలపై ఈ దీపాల(బుగ్గల) వినియోగానికి అవకాశం కల్పించే నిబంధనలను రద్దుచేస్తూ కేంద్ర మంత్రి మండలి బుధవారం నిర్ణయం తీసుకొంది. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలు, పోలీసు వాహనాలు లాంటి వాటికి మాత్రమే నీలి దీపాన్ని వాడేందుకు మినహాయింపు ఉంటుంది. ప్రత్యేక దీపాలను తొలగించాలనే ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ ముందుకు తెచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.
బుగ్గలు వాడొద్దు
ఎర్ర దీపం, నీలి దీపం తొలగింపునకు వీలుగా కేంద్ర మోటారు వాహన నిబంధనలు-1989కు చాలా సవరణలు చేస్తున్నట్లు అరుణ్ జైట్లీ తెలిపారు. 108 నిబంధన కింద ఉన్న వివిధ ఉపనిబంధనలు ఈ దీపాల ఏర్పాటుకు అనుమతిస్తున్నాయని, 108(1) కింద ఉన్న ఒక ఉపనిబంధన ప్రకారం ఉన్నతస్థానాల్లోని కొందరు వ్యక్తులకు ఎర్ర దీపాన్ని ఉపయోగించడానికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చే అధికారం కేంద్రానికి ఉందని చెప్పారు. 108(2) కింద రాష్ట్ర ప్రభుత్వాలకు నీలి దీపాన్ని ఉపయోగించుకునే అధికారం ఉందని, ఈ నిబంధనలను రద్దుచేస్తున్నామని తెలిపారు.. ఈ దీపాలను ఎవరూ వాడటానికి వీల్లేదనీ, వ్యక్తులెవరికీ మినహాయింపు లేదు' అని స్పష్టం చేశారు.
సైరన్లు కూడా రద్దు
సైరన్లను కూడా రద్దుచేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రత్యేక దీపాలు, సైరన్లు వీఐపీ సంస్కృతికి చిహ్నాలని, ప్రజాస్వామ్య దేశంలో వీటికి చోటులేదని పేర్కొన్నారు. మే 1 నుంచి వీటిని వాడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకొంటామని స్పష్టంచేశారు.
ప్రతీ భారతీయుడు వీఐపీనే
వాహనాలపై ప్రత్యేక దీపాలు నవ భారత స్ఫూర్తికి విరుద్ధమని, వీటిని ఎప్పుడో తొలగించి ఉండాల్సిందని ప్రధాని మోడీ ‘ట్విట్టర్'లో పేర్కొన్నారు. ఈ దిశగా ఇప్పుడు గట్టి చర్య తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ‘ప్రతీ భారతీయుడు ప్రత్యేకమైనవాడే. ప్రతీ భారతీయుడు వీఐపీనే' అని వ్యాఖ్యానించారు.
బుగ్గలు తొలగించిన శివరాజ్, గడ్కరీ, ఫడ్నవీస్
కేబినెట్ సమావేశం ముగిశాక కేంద్ర మంత్రుల్లో అందరి కన్నా ముందుగా గడ్కరీ తన అధికార వాహనంపై ఎర్రబుగ్గను తొలగించారు. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలశాఖ సహాయ మంత్రి గిరిరాజ్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, పలువురు మహారాష్ట్ర మంత్రులు కూడా ఇదే బాటలో నడిచారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు 2014లో మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన అధికార వాహనంపై ఎర్ర దీపాన్ని వాడటం లేదు.
ఎర్రబుగ్గ సంస్కృతికి స్వస్తి
ఎర్ర బుగ్గల సంస్కృతిని తొలగించాలంటూ సుప్రీం కోర్టు 2013లో కేంద్రాన్ని ఆదేశించటం తెలిసిందే. అయితే కేంద్రం ఇప్పుడు రాజ్యాంగ పదవులతోపాటు ఇతర పదవులు నిర్వహించేవారి కార్లపైనా ఎర్ర లైట్లు పెట్టుకోకుండా చర్యలు తీసుకుంది. ఇంతకాలం దాదాపు 30 క్యాటగిరీల కింద వివిధ స్థాయిల్లోని వారికి తమ కార్లపై ఎర్ర బుగ్గ పెట్టుకునేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు 108 రూలు కింద అనుమతిచ్చేవి. మే 1నుంచి ఆ సంస్కృతి ఇక మాయమవుతుంది.