45 రోజుల తర్వాత స్పందించిన కేంద్రం, షహీన్బాగ్ ఆందోళనకారులతో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిష్టర్ను వ్యతిరేకిస్తూ షహీన్బాగ్లో ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం ఇండికేషన్స్ ఇచ్చింది. వారితో మాట్లాడటం వల్ల సీఏఏపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయొచ్చని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. సీఏఏను వ్యతిరేకిస్తూ దాదాపు రెండునెలల నుంచి చేస్తున్న ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం తొలిసారి స్పందించింది.
షహీన్బాగ్ ఆందోళనకారులతో మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని శనివారం రవిశంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు. సీఏఏపై వారికున్న అభ్యంతరాలపై క్లారిటీ ఇస్తామని చెప్పారు. ఆందోళనకారులతో తమ చర్చలు నిర్మాణాత్మక పద్ధతిలో జరుగుతాయని వెల్లడించారు. సీఏఏ, ఎన్ఆర్సీపీ ఢిల్లీలోని సహీన్బాగ్లో గత 45 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
షహీన్బాగ్లో ఆందోళన చేయడంతో నోయిడా-ఢిల్లీ మధ్య రాకపోకలను నిలిపివేశారు. ఆందోళనలు హింసాత్మకంగా మారుతాయనే ఉద్దేశంతో నోయిడా ట్రాఫిక్ పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు జామియా మిలియా ఇస్లామియా వర్సిటీలో కూడా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. గురువారం వర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేస్తుండగా గోపాల్ అనే వ్యక్తి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. కాల్పుల్లో విద్యార్థి షాదాబ్ ఫరూక్ గాయపడ్డారు. అతనికి ఢిల్లీ ఎయిమ్స్లో సర్జరీ కూడా చేశారు. అతని ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందని వైద్యులు తెలిపారు.