దసరా బోనస్: 12లక్షల మంది రైల్వే ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం తీపి కబురు
న్యూఢిల్లీ: దసరా పర్వదినం సందర్భంగా రైల్వే ఉద్యోగులకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. దసరా పండగ సందర్భంగా ఈ ఏడాది కూడా 78రోజులకు బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
2017-18 ఆర్థిక సంవత్సరానికి గానూ రైల్వే ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్(పీఎల్బీ) 78రోజులకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి రవిశంకర్ బుధవారం వెల్లడించారు. నాన్ గెజిట్ రైల్వే ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్ లభించనుందని తెలిపారు.
ఈ బోనస్ కింద ఉద్యోగులు తమ వేతనంతోపాటు సుమారు రూ.18వేలు అదనంగా బోనస్ కింద పొందనున్నారు. పీఎల్బీ బోనస్తో సుమారు 12.26లక్షల మంది రైల్వే ఉద్యోగులు పొందనున్నారు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(ఆర్పీఎస్ఎఫ్) ఉద్యోగులకు ఇది వర్తించదు. ఈ బోనస్ వల్ల దాదాపు రూ. 2044.31 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుంది. గత కొద్ది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఈ బోనస్ ఇస్తోంది.