అవినీతి అనకొండలు: 15మంది సీనియర్ ఉన్నతాధికారులపై మోడీ ప్రభుత్వం వేటు
న్యూఢిల్లీ: అవినీతిపై మోడీ ప్రభుత్వం యుద్ధం కొనసాగిస్తోంది. అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు రుజువు కావడంతో 12 మంది ఆదాయపు పన్ను శాఖా అధికారులపై ఇప్పటికే వేటువేసింది. తాజాగా కస్టమ్ డిపార్ట్మెంట్కు చెందిన 16మంది సీనియర్ ఉన్నతాధికారులపై కొరడా ఝుళిపించింది. ఇందులో ప్రిన్సిపల్ కమిషనర్, కమిషనర్, అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ మరియు కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖా అధికారులు ఉన్నారు.
గతవారం ప్రభుత్వం 12 మంది సీనియర్ ఇన్కంటాక్స్ అధికారులపై వేటువేసింది.ఇందులో జాయింట్ కమిషనర్ ర్యాంక్ ఉన్న వ్యక్తి కూడా ఉన్నారు. అవినీతికి పాల్పడ్డారనే కారణంతో ఆయనపై చర్యలకు దిగింది ప్రభుత్వం.అంతేకాదు పనివేళల్లో తప్పుగా ప్రవర్తించారనే ఆరోపణలు కూడా ఆయనపై రావడంతో చర్యలు తీసుకోక తప్పలేదు. ఇక ప్రభుత్వం వేటు వేసిన వారిలో ప్రిన్సిపల్ కమిషనర్ అనూప్ శ్రీవాస్తవ ఉన్నారు. ఈయన కేంద్ర పరోక్ష పన్నుల శాఖ మరియు కస్టమ్స్లో పనిచేస్తున్నారు. ఇదే సంస్థలో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న నలిన్ కుమార్ పై కూడా చర్యలు తీసుకోవడం జరిగింది.
ప్రిన్సిపల్ కమిషనర్ అనూప్ శ్రీవాస్తవపై సీబీఐ 1996లో క్రిమినల్ మరియు కుట్ర కేసు నమోదు చేసింది. ఓ భవన నిర్మాణం కోసం నిబంధనలు ఉల్లంఘించి వారికి ఎన్ఓసీ ఇప్పించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి.2012లో దిగుమతి సుంకం ఎగవేసేందుకు లంచం అడిగారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. అంతేకాదు.. తను అనుకున్న వారినే అరెస్టులు చేశారని, వేధింపులు, ఇతరత్రా కేసులు శ్రీవాస్తవపై ఉన్నాయి. ఇక జాయింట్ కమిషనర్ నలిన్ కుమార్ పై కూడా అక్రమాస్తులున్నాయన్న ఆరోపణలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. వీరిద్దరినీ మంగళవారం నుంచి విధుల్లోనుంచి తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇక విధుల నుంచి తొలగించిన వారందరికీ చట్టప్రకారం అందాల్సిన వేతనాలు అన్నీ మూడు నెలలవరకు అందుతాయని కేంద్రం జారీ చేసిన ఆదేశాల్లో ఉంది. ఇక చట్టప్రకారం ప్రాథమిక నిబంధనలు అనుసరించి ఒక ప్రభుత్వ ఉద్యోగిని ప్రజాప్రయోజనాల దృష్ట్యా మూడునెలల నోటీసు సమయం ఇచ్చి ఎప్పుడైనా విధుల నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న 16మంది సీనియర్ ఉన్నతాధికారులను గుర్తించి వారిపై మోపబడి రుజువైన ఆరోపణల ఆధారంగా వారిని విధుల నుంచి తొలగించడం జరిగింది.