మైనార్టీలపై దాడులని అమెరికా సంస్థ: ఇంతే తెలుసా.. మోడీ ప్రభుత్వం కౌంటర్
న్యూఢిల్లీ: భారత దేశం గురించి మీకు తెలిసింది ఇంతేనా అంటూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికన్ సంస్థ ది యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడంకు చురకలు అంటించింది. భారత్లో మత స్వేచ్ఛ పైన సదరు సంస్థ రెండు రోజుల క్రితం ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త ప్రభుత్వ హయాంలో మైనార్టీలపై దాడులు అంటూ ఆ కమిషన్ నివేదిక ఇచ్చింది.
దీనిపై ప్రధాని మోడీ ప్రభుత్వం స్పందించింది. భారత్ గురించి మీరు తెలుసుకున్నది ఇంతేనా అంటూ ప్రశ్నించారు. అసలు ఈ నివేదిక గురించి ఆలోచించడం లేదని చెప్పారు. విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ సదరు సంస్థ నివేదికపై స్పందించారు.
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారత్లో మైనార్టీల పైన హింసాత్మక దాడులు చోటు చేసుకుంటున్నాయని అమెరికా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఒక కమిషన్ పేర్కొంది. ఆరెస్సెస్ వంటి సంస్థలు బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడుతున్నాయని, ఘర్ వాపసీ వంటి కార్యక్రమాలను చేపడుతున్నాయని తెలిపింది.
మతాల పైన అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని బహిరంగంగా హెచ్చరించి, దేశంలో మత స్వేచ్ఛ ప్రమాణాలను పెంచేలా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని అమెరికా సర్కారుకు సూచించింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛ పైన ఏర్పడిన అమెరికా కమిషన్(యఎస్సీఐఆర్ఎఫ్) తన తాజా వార్షిక నివేదికలో భారత్కు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించింది.
చాలాకాలం నుండి మైనార్టీలను రక్షించడంలో కానీ నేరాలు జరిగినప్పుడు కానీ వారికి న్యాయం చేయడంలో కానీ భారత్ విఫలమవుతోందని, గత మూడేళ్లలో మతహింస పెరిగిందని వార్తలు వచ్చాయని, ఏపీ, యూపీ, బీహార్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, ఒడిశా, కర్నాటక, ఎంపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ లలో మతపమైన దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, ఎన్నికల తర్వాత అధికార బీజేపీ నేతలు మైనార్టీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎక్కువైందని పేర్కొంది.