దేశ రైతుల ఆదాయాన్ని బిహార్ స్థాయికి తగ్గించాలనుకుంటున్నారు : కేంద్రంపై రాహుల్ విమర్శలు
దేశంలో రైతులు తమ ఆదాయం పంజాబ్ రైతుల స్థాయిలో ఉండాలని కోరుకుంటుంటే నరేంద్ర మోదీ సర్కార్ మాత్రం వారి ఆదాయాన్ని బిహార్ రైతుల స్థాయికి పడగొట్టాలని చూస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్లో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ... దేశంలో ఆయా రాష్ట్రాల రైతుల సగటు ఆదాయానికి సంబంధించిన ఓ సర్వేను పోస్ట్ చేశారు.
ఆ సర్వే ప్రకారం... దేశంలో పంజాబ్ రైతులు అత్యధిక వార్షిక సగటు ఆదాయం రూ.2,16,708 పొందుతుండగా... అత్యల్పంగా బిహార్ రైతులు వార్షిక సగటు ఆదాయంగా రూ.42,684 మాత్రమే పొందుతున్నారు. దేశంలో రైతు కుటుంబ సగటు వార్షిక ఆదాయం రూ.77,124గా ఉండగా... ఇప్పటికీ 8 రాష్ట్రాల్లోని రైతులు అంతకంటే తక్కువ ఆదాయాన్నే పొందుతున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటం గమనార్హం.
కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ ట్వీట్ చేశారు. దేశ రైతుల ఆదాయాన్ని బిహార్ స్థాయికి తగ్గించేందుకే కేంద్రం కొత్త చట్టాలను తీసుకొచ్చిందని పరోక్ష విమర్శలు చేశారు.
కాగా,కేంద్రం రైతులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతులు తమ ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆరుసార్లు కేంద్రానికి,రైతులకు మధ్య చర్చలు జరిగినప్పటికీ ఎటువంటి పురోగతి లభించలేదు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న సింగిల్ ఎజెండాతో రైతులు చర్చలకు హాజరవగా.. కేంద్రం సవరణలు ప్రతిపాదించింది. చట్ట సవరణలకు రైతులు ఒప్పుకోకపోవడంతో చర్చల్లో ఎటువంటి పురోగతి లభించలేదు.
తాజాగా భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) ఈ చట్టాలను సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ చట్టాలను అమలుచేస్తే రైతులు కార్పోరేట్ శక్తుల దురాగతాలకు బలైపోతారని అందులో పేర్కొంది. మరోవైపు కేంద్ర మాత్రం రైతులు కోరినట్లుగా చట్టంలో కనీస మద్దతు ధరకు సంబంధించి సవరణలు చేస్తామని... రైతులు మళ్లీ చర్చలకు వస్తారని ఆశిస్తున్నామని తెలిపింది.
किसान चाहता है कि उसकी आय पंजाब के किसान जितनी हो जाए।
— Rahul Gandhi (@RahulGandhi) December 11, 2020
मोदी सरकार चाहती है कि देश के सब किसानों की आय बिहार के किसान जितनी हो जाए। pic.twitter.com/8lqEfUf2td