ఆర్థిక వ్యవస్థకు ఊతమే లక్ష్యం: ఉద్దీపనలపై సర్కార్ ఫోకస్
గాడితప్పిన ఆర్థిక వ్యవస్థకు తగిన చేయూతనిచ్చేందుకు గల అవకాశాలపై కేంద్ర ప్రభుత్వం ద్రుష్టిని కేంద్రీకరిస్తోంది.
న్యూఢిల్లీ: గాడితప్పిన ఆర్థిక వ్యవస్థకు తగిన చేయూతనిచ్చేందుకు గల అవకాశాలపై కేంద్ర ప్రభుత్వం ద్రుష్టిని కేంద్రీకరిస్తోంది. ఈ పండుగల వేళ వినియోగదారులు మరింత ఖర్చు చేసేందుకు వీలుగా వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు, చిన్న మధ్య స్థాయి వ్యాపార సంస్థల (ఎస్ఎంఈ)కు సులభంగా రుణాలు అందేలా చేయడం, పెట్టుబడుల ఉపసంహరణను మరింత వేగవంతం చేయడం వంటి చర్యలు ప్రభుత్వ ఉద్దీపనల ప్యాకేజీలో భాగంగా ఉన్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.
దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో మూడేళ్ల కనిష్ట స్థాయి(5.7 శాతాని)కి పడిపోయింది. నల్లధనం అరికట్టడం కోసం గతేడాది నవంబర్ ఎనిమిదో తేదీన పెద్ద నోట్లను రద్దు చేయడం, ఆదాయం పెంపుదల కోసం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుతో ఈ పరిస్థితి ఏర్పడింది.
ఒత్తిళ్ల నివారణకు ఇవీ ప్రతిపాదిత చర్యలు
ఈ నేపథ్యంలో దేశీయ పెట్టుబడులకు ప్రోత్సాహం, గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు, చౌక ఇళ్లకు మరిన్ని నిధులను అందుబాటులో ఉంచడం వంటి అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, వాటికి తీసుకోవాల్సిన చర్యల వివరాలతో ఇప్పటికే ఓ నివేదిక రూపొందించారు. లిక్విడిటీ సమస్య ఉన్నట్టు ప్రభుత్వం సైతం అంగీకరించిందని అధికార వర్గాల కథనం. జీడీపీలో ద్రవ్య లోటును 3.2 శాతానికి సవరించే విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. ప్రైవేట్ వినియోగం తక్కువగా ఉందని, కనుక పన్ను రేట్లను తగ్గించాలనే సూచన ప్రభుత్వం ముందుకు వచ్చినట్టు పేర్కొన్నాయి.
వ్యయం తగ్గించుకునే మార్గాలివి
ప్రస్తుత పరిస్థితులు మూడు నుంచి నాలుగు నెలల్లో సర్దుకుంటాయని, ద్రవ్యలోటు లక్ష్యాన్ని దాటదనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కొన్ని రైల్వే ఆస్తుల విక్రయం, ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వరంగంలోని బ్లూచిప్ కంపెనీల్లో కొంత మేర వాటాల విక్రయంతో పన్నేతర ఆదాయాన్ని రాబట్టే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. రైల్వే మార్గాల అభివృద్ధికి దక్షిణ కొరియా కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. వాటి నుంచి పెట్టుబడులు తరలివస్తే రైల్వేపై ప్రభుత్వ వ్యయం తగ్గుతుందని అధికార వర్గాలు తెలిపాయి.