మా నినాదమిదే, ఈ అయిదేళ్లలో ఏం చేశామంటే, ఇలా ఊహించలేదు: జైట్లీ సుదీర్ఘ లేఖ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అయిదేళ్ల పాటు ఇరవై నాలుగు గంటలు బాగా పని చేశారని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఆయన మరోసారి ఫేస్బుక్లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఏ అంశాన్నైనా త్వరగా అవగాహన చేసుకోవడంతో పాటు విదేశీ విధానం, ఆర్థిక ప్రగతిలో తానేమిటో నిరూపించుకున్నారని పేర్కొన్నారు. ఏ విషయంలో అయినా స్పష్టత ఉందని, క్లిష్ట సమయాల్లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని తానేమిటో నిరూపించుకున్నారన్నారు.
ఒక్కమాటా లేదు.. చైనా అధ్యక్షుడికి భయపడుతున్న బలహీన మోడీ: మసూద్ అజహర్ ఇష్యూపై రాహుల్
విధాన నిర్ణయాలకు సంబంధించి తన టీంతో, కేంద్రమంత్రులతో, వివిధ డిపార్టుమెంట్లకు చెందిన అధికారులతో ప్రధాని మోడీ గంటల తరబడి కూర్చునేవారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది భారతీయులు మోడీ తీరు పట్ల ఆకర్షితులయ్యారన్నారు. మోడీ నమ్మదగిన వ్యక్తి అని, మోడీ సాధ్యం చేసి చూపిస్తాడనే నినాదంతో వెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు మోడీ హయాంలో కొన్ని ల్యాండ్ మార్క్స్ అంటూ పేర్కొన్నారు.
ఆదాయపన్ను సహా అన్ని పన్నులు తగ్గించాం
అయిదేళ్ల నరేంద్ర మోడీ హయాంలో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఈ అయిదేళ్ల కాలంలో ప్రత్యక్ష లేదా పరోక్ష పన్నులు పెంచలేదన్నారు. పైగా వాటిని తగ్గించామన్నారు. ఆదాయపన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచామని తెలిపారు. ప్రతి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలా తక్కువ శ్లాబ్లలోకి ఎక్కువ వస్తువులను తీసుకొచ్చామని అభిప్రాయపడ్డారు. చిన్న, మధ్య తరహా వ్యాపారులకు రూ.40 లక్షల టర్నోవర్ వరకు జీఎస్టీని లేకుండా చేశామన్నారు. రూ.1.5 కోట్ల టర్నోవర్ వరకు ఒక్క శాతం జీఎస్టీ ఉందన్నారు. హౌసింగ్ లోన్ ఒక్క శాతానికి తగ్గించామన్నారు. ఓ వైపు ప్రజలందరికీ పన్నులు తగ్గించినప్పటికీ, పన్నులు కట్టే వారి పరిధి పెరిగిందని, దీంతో ఆదాయం పెరిగిందన్నారు.
ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు
20 నెలల్లోనే జీఎస్టీని సరళీకృతం చేశామని జైట్లీ పేర్కొన్నారు. బిల్లుకు ఆమోదం కూడా అయిందన్నారు. అసలు ట్యాక్స్ తగ్గించి, అదే విధంగా ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుందని ఎవరూ ఊహించలేదని, దానిని మోడీ హయాంలో సాధించామన్నారు. 2014లో రోజుకు 7 కిలో మీటర్ల హైవేను నిర్మించామని, ఇప్పుడు రోజుకు 30 కిలో మీటర్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అంటే ఏడాదాకి పదివేల కిలో మీటర్లు అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద హైవే డెవలపర్ ఇండియా అన్నారు. 2014లో 38 శాతం గ్రామీణ భారతానికి శానిటేషన్ ఉంటే, ఇప్పుడు 99 శాతం ఉందని చెప్పారు. 91 శాతం గ్రామాలకు రోడ్లు నిర్మించామన్నారు. గ్రామీణ రోడ్ల పైన మూడు రెట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
ముద్ర యోజన
ఆయుష్మాన్ భారత్ ద్వారా 50 కోట్ల మంది ప్రజలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు మేర వైద్యం అందిస్తున్నామన్నారు. ఈ పథకాన్ని 23 సెప్టెంబర్ 2018 నుంచి అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 15.27 లక్షల మందికి డబ్బులు లేకుండా వైద్యం అందిందని చెప్పారు. దేశంలోని దాదాపు ప్రతి ఇంటికి విద్యుత్ ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద 35 కోట్ల మందికి బ్యాంకు అకౌంట్లు వచ్చాయన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది అన్నారు. ముద్ర యోజన కింద 16 కోట్లకు పైగా లోన్లు ఇచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 54 శాతం లబ్ధి చేకూరిందని, 74 శాతం మంది మహిళలు లబ్ధి పొందారన్నారు. 2014లో 65 కమర్షియల్ ఫ్లైట్లు నడిచే 65 విమానాశ్రయాలు ఉంటే, ఇప్పుడు 101 ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో మరో యాభై పెరుగుతాయన్నారు.
సరికొత్త ఇండియా
160 కిలో మీటర్లు నడిచే రైళ్లను ప్రవేశ పెట్టామని, ఇది సరికొత్త చరిత్ర అని జైట్లీ పేర్కొన్నారు. త్వరలో బుల్లెట్ ట్రైన్ రాబోతుందన్నారు. ప్రయాణీకులకు సౌకర్యాలు పెరిగాయన్నారు. బ్యాంకులకు ఎగవేసిన వారిపై కఠిన చర్యలకు ఐబీసీ తీసుకు వచ్చామన్నారు. ఆధార్ ద్వారా అందరికీ లబ్ధిదారులకు నేరుగా పథకాలు చేరుతున్నాయన్నారు. రైతులకు మద్దతు ధర కోసం రూ.75వేల కోట్లకు తోడు ఎంఎన్ఆర్ఈజీఏ కోసం రూ.60,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కోసం రూ.6000 ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 2.77 కోట్ల మంది రైతులకు మొదటి విడత డబ్బులు అందాయని తెలిపారు.
పది శాతం రిజర్వేషన్లు
భారత దేశంలో నిజాయితీ కలిగిన ప్రభుత్వం సాధ్యమని తమ ప్రభుత్వం నిరూపించిందని జైట్లీ పేర్కొన్నారు. భారత దేశ చరిత్రలో తొలిసారి వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్ ప్రవేశపెట్టామన్నారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా భారత్ సత్తా చాటిందన్నారు. భారత్ అన్నింటా సత్తా చాటిందని, లీడర్షిప్ కారణంగా భారీ మార్పులు కనిపించాయని తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వం, నిర్ణయాలు, పని తీరును ఆమోదించేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.