50రోజులన్నారు.. ఇప్పటికీ ఏడాదిన్నర?; 'బ్యాంకింగ్'ని సర్వనాశనం చేశారు: మోడీపై రాహుల్
ముంబై: 'ఏయే ఏటీఎంలలో క్యాష్ ఉందో వివరాలు చెప్పబడును.. ఫీజు రూ.100' అని సోషల్ మీడియాలో కార్టూన్ జోక్స్ హల్ చల్ చేస్తున్న పరిస్థితి. దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న కరెన్సీ కష్టాలకు ఈ కార్టూన్ అద్దం పడుతోంది. ఒకరకంగా నోట్ల రద్దు నాటి పరిస్థితులు పునరావృతమవుతున్న ఫీలింగ్ కలుగుతోంది. కారణమేంటన్నది అటు ఆర్బీఐ, ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్పట్లేదు. ప్రజలు మాత్రం గంటల కొద్ది మళ్లీ ఏటీఎంల ముందు నిరీక్షించాల్సిన దుస్థితి. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఇదే అవకాశంగా మారింది. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ అంశానికి సంబంధించి మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సర్వనాశనం చేశారు: రాహుల్
మోడీ బ్యాంకింగ్ వ్యవస్థను సర్వనాశనం చేశారని తాజాగా రాహుల్ గాంధీ విమర్శించారు. 'నీరవ్ మోడీ రూ.30వేల కోట్ల కుంభకోణానికి పాల్పడి పారిపోతే.. మోడీ దానిపై ఒక్క మాటైనా మాట్లాడలేదు. మనందరిని బలవంతంగా క్యూల్లో నిలబెట్టి.. మన జేబుల్లో నుంచి రూ.500, రూ.1000నోట్లు దొంగిలించి.. వాటిని తీసుకెళ్లి నీరవ్ మోడీ జేబుల్ని నింపేశారు' అని రాహుల్ ఎద్దేవా చేశారు.
15ని. టైమ్ ఇస్తే..
పార్లమెంటులో మాట్లాడటానికి కూడా ప్రధాని భయపడ్డారని రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంటులో మాట్లాడేందుకు తమకు 15నిమిషాల సమయం ఇస్తే.. రఫెల్ యుద్ద విమానాల ఒప్పందం, నీరవ్ మోడీ కుంభకోణాల్లో అసలు నిజాలను బయటపెడుతామని పేర్కొన్నారు. ఇంత జరుగుతుంటే ఇంకా 'అచ్చే దిన్(మంచి రోజులు)' అంటూ బీజేపీ నేతలు ప్రచారం చేయడాన్ని ఆయన తప్పు పట్టారు.
50రోజులన్నారు..
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒబ్రియెన్ సైతం ఇదే అంశంపై మోడీపై విమర్శలు చేశారు. నోట్ల రద్దు సమయంలో.. 50రోజుల్లో అంతా సాధారణ స్థితికి వస్తుందని మోడీ చెప్పారని గుర్తుచేశారు. కానీ ఒకటిన్నర సంవత్సరం గడిచిపోయినా కరెన్సీ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయని అన్నారు. నోట్ల రద్దు సమయంలో ఎదుర్కొన్న కష్టాలే ఇప్పుడు కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు.
దేశవ్యాప్తంగా కరెన్సీ కష్టాలు
మరోవైపు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాత్రం.. నగదు కొరత తాత్కాళికమేనని, కొద్దిరోజుల్లోనే సమస్య పరిష్కారమవుతుందని చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ఏటీఎంలలో దాదాపుగా ఎక్కడా నగదు అందుబాటులో లేని పరిస్థితి. దీంతో చిరు వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.